Fake News:EMIల వాయిదాలకు ఓటీపీ అడుగుతున్నారా..జాగ్రత్త..!
న్యూఢిల్లీ: కరోనావైరస్తో దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. ఈ సమయంలోనే సోషల్ మీడియా వేదికగా పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇందులో సగానికి పైగా వార్తలు బూటకపు వార్తలే కావడం విశేషం. సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతున్న ఫేక్ న్యూస్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతోంది పోలీస్ శాఖ. ఆ వార్తలను నమ్మి మోసపోవద్దని సూచిస్తోంది. ముఖ్యంగా మీ మొబైల్కు ఓటీపీ వచ్చింది ఆ ఓటీపీ చెప్పండి అంటూ బ్యాంకుల నుంచి ఫోన్లు చేస్తున్నట్లుగా కొందరు కేటుగాళ్ల నుంచి ఫేక్ కాల్స్ వస్తున్నాయి. బ్యాంకులు ఎప్పటికీ కస్టమర్లకు ఫోన్ చేసి ఓటీపీలు అడగవనే సంగతి తెలుసుకోవాలంటున్నారు బ్యాంకు అధికారులు.
లాక్డౌన సమయంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వం ఈఎంఐలపై మారటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొందరు కేటుగాళ్లు రంగంలోకి దిగారు. ఈఎంఐలు మారటోరియం సమయంలో కట్టకుండా వాయిదా వేసుకునేందుకు కస్టమర్ మొబైల్కు ఓటీపీ పంపామని కొందరు ఫోన్లు చేస్తున్నారు.
ఆ ఓటీపీ తమకు చెబితే ఈఎంఐలను వాయిదా వేస్తామంటూ ఫోన్లు చేస్తున్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్ పై జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఆయా బ్యాంకులు ఓటీపీలు అడగవని పొరపాటున మొబైల్కు వచ్చిన ఓటీపీ చెప్పాల్సిందిగా ఫోన్ వస్తే సంబంధిత బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం కోరుతోంది. ఓటీపీ చెబితే మాత్రం మీ ఖాతా నుంచి నగదు మాయం అవడం ఖాయమని హెచ్చరిస్తోంది.
సైబర్ నేరగాళ్లపై దృష్టి సారించిన పోలీస్ శాఖ బ్యాంకులకు కూడా ఆదేశాలు ఇవ్వడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. తమ ఈఎంఐలను వాయిదా వేయాలంటే తమ మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటీపీ చెప్పాలంటూ వస్తున్న కాల్స్ పై జాగ్రత్తతో వ్యవహరించాలని ఎస్బీఐ హెచ్చరికలు జారీ చేసింది.
ఈఎంఐ వాయిదా వేసుకునేందుకు ఓటీపీతో పనిలేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకునేందుకు ఒక్కటే మార్గం ఉందని చెప్పిన ఎస్బీఐ.. చాలా అలర్ట్గా ఉండటమే అని వివరించింది.ఈఎంఐ వాయిదాలకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే నేరుగా బ్యాంకుకు వెళ్లి క్లారిటీ తీసుకోవాల్సిందిగా ఎస్బీఐ సూచించింది.