Fake News:ఫేక్ శానిటైజర్లతో ఫోటో వైరల్.. ఇది మనదేశంలో కాదు..!
న్యూఢిల్లీ: కరోనావైరస్ పై సోషల్ మీడియాలో చాలా వదంతులు వస్తున్నాయి. ఇప్పటికే ఈ వదంతులను నమ్మి పలువురు నష్టాలు కోరి తెచ్చుకున్నారు కూడా. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను లేదా వదంతులను నమ్మొద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అంతేకాదు ప్రభుత్వం సూచించిన విధానాలనే పాటించాలని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇక తప్పుడు వార్తలపై కూడా ప్రభుత్వం నిఘా పెంచింది. అవాస్తవాలను అదే పనిగా ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలకు దిగుతోంది ప్రభుత్వం.
తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఏదో ద్రవపదార్థం ఉన్న బాటిళ్లతో ఇద్దరు భద్రతా సిబ్బందికి పట్టుబడినట్లు ఉన్న ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. బాటిల్స్తో పాటు బకెట్లు కూడా ఆఫోటోలో కనిపిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో నెటిజెన్లు దీనిపై వివరణ ఇస్తూ తప్పుడు సమాచారంను షేర్ చేస్తున్నారు. ఈ ఫోటో భారత్కు సంబంధించిందని, దీని వెనక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారంటూ నెటిజెన్లు చెబుతున్నారు. అంతేకాదు ముస్లిం సామాజిక వర్గం వారు ఫేక్ శానిటైజర్లు అమ్ముతున్నారంటూ నెటిజెన్లు కామెంట్ చేశారు.
ఇక ఫోటోలో కనిపిస్తున్న సెక్యూరిటీ సిబ్బందిని వారు ధరించిన యూనిఫాంను దగ్గరగా పరిశీలిస్తే RAB అని రాసి ఉంటుంది. RAB అంటే ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ అని అర్థం. బంగ్లాదేశ్ పోలీస్ విభాగానికి చెందిన యాంటీ టెర్రర్ ఫోర్స్, యాంటీ క్రైమ్ వారు ధరించే యూనిఫాం అది. అంతేకాదు ఈ ఫోటోకు సంబంధించిన వార్త ఇప్పటికే చాలా వరకు బంగ్లాదేశ్ వెబ్సైట్లలో సైతం వచ్చింది. బంగ్లాదేశ్లోని నారాయణ్ గంజ్లో ఫేక్ శానిటైజర్లను తయారు చేస్తున్న ముఠాని ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ పట్టుకున్నారని వార్తను ప్రచురించాయి. అంతేకాదు ఈ ఫేక్ శానిటైజర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వార్త రాశారు.
Recommended Video
ఏప్రిల్ 3వ తేదన ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ నారాయణ్ గంజ్లోని ఓ ఫ్యాక్టరీపై సోదాలు నిర్వహించిందని ఆ సమయంలో ఫేక్ శానిటైజర్లను స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఫేక్ శానిటైజర్లను మార్కెట్లోకి స్మగ్లింగ్ చేస్తున్నట్లు వార్తలో రాశారు. కాబట్టి ఒక ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేసి ఒక మతానికి ఆపాదించడం సరికాదని ఈ ఫోటోలో ఎలాంటి వాస్తవాలు లేవనేది అర్థమవుతోందని అధికారులు ధృవీకరించారు.