మోదీపై ఫేక్ న్యూస్.. అందులో ఏమాత్రం నిజం లేదు..
ప్రపంచ దేశాలన్నింటినీ కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. వైరస్ నియంత్రణ చిట్కాలతో పాటు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కూడా లేనిపోనివి ఆపాదించి ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై కూడా ఓ ఫేక్ వార్తను ఎవరో సోషల్ మీడియాలో వదిలారు. అగ్రరాజ్యం అమెరికా సహా 18 దేశాలు కరోనా నియంత్రణ కోసం సంయుక్తంగా ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్కు ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వం వహించబోతున్నారని ఆ ఫేక్ న్యూస్లో పేర్కొన్నారు. 'ఇది భారతీయులందరు గర్వపడే విషయం.. మోదీపై నమ్మకం ఉంచితే భారత్ గెలుస్తుంది' అని కూడా పేర్కొన్నారు.
ఎలా పుట్టుకొచ్చిందో ఏమో గానీ సోషల్ మీడియాలో ఈ ఫేక్ న్యూస్ విపరీతంగా హల్చల్ చేస్తోంది. అయితే ఈ వార్తలో ఎంతమాత్రం నిజం లేదు. ఇది పూర్తిగా తప్పుడు సమాచారం. narendramodi.inలో ఒకసారి చెక్ చేస్తే ఈ విషయం ఎవరికైనా స్పష్టమవుతుంది. కరోనా నియంత్రణ చర్యల కోసం మోదీ తీసుకుంటున్న చర్యలన్నింటిని ఇందులో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు. అందులో ఈ సమాచారం ఎక్కడా లేదు.
మార్చి 26న జరిగిన G-20 దేశాల సదస్సులో కరోనా మహమ్మారిపై పోరాటానికి ప్రధాని మోదీ అంతర్జాతీయ స్థాయిలో చేసిన ప్రయత్నాలను ఆ సైట్లో వివరించారు. ఇందులో భాగంగా సౌదీ అరేబియా అధినేత ప్రిన్స్ క్రౌన్,బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్,ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహులతో ఫోన్లో మాట్లాడినట్టు పేర్కొన్నారు. కరోనా నియంత్రణ చర్యల గురించి వారితో చర్చించినట్టు తెలిపారు. మార్చి 25వ తేదీన రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చలు జరిపినట్టు తెలిపారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో కోవిడ్ 19పై పోరాటానికి ఎలాంటి టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసినట్టు గానీ.. దానికి మోదీని నాయకత్వం వహించాలని కోరినట్టుగా ఎక్కడా పేర్కొనబడలేదు. పరస్పర సహకారంతో కరోనాను ఎదుర్కోవాలని మాత్రమే అన్ని దేశాలు నిర్ణయించినట్టు పేర్కొన్నారు.