ఫేక్ న్యూస్: ఆర్థిక సంవత్సరాన్ని రీసెట్ చేశారా? రిజర్వుబ్యాంకు ఏం చెబుతోంది?
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందటాన్ని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించింది. ఆర్థిక లావాదేవీలు, ఇతర కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఆర్థిక సంవత్సరం ముగింపును పొడిగించిందని, ఆర్థిక సంవత్సరాన్ని కొత్తగా రీసెట్ చేసిందనే వార్తలు దేశవ్యాప్తంగా చక్కర్లు కొట్టాయి. దీనికి అనుగుణంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హడావుడిగా విలేకరుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం.. ఈ అనుమానాలకు బలాన్ని కలిగించింది.
మంగళవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన నిర్మలా సీతారామన్.. ఆ ఊసే ఎత్తలేదు. ఆర్థిక సంవత్సరాన్ని రీసెట్ చేయడానికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని కూడా వెల్లడించలేదు. దీనితో- అప్పటిదాకా వినిపించిన వార్తలన్నీ ఊహాజనితమైనవేనని తేలిపోయాయి. నిజానికి- ఏటేటా ఏప్రిల్ 1వ తేదీ నుంచి.. మార్చి 31వ తేదీ వరకు మధ్యకాలాన్ని ఆర్థిక సంవత్సరంగా భావిస్తుంటారు.
Recommended Video
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం.. అంటే 2019-2020 ఆర్థిక సంవత్సరం ఈ నెలాఖరులోగా ముగుస్తుంది. కరోనా వైరస్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఆర్థిక సంవత్సర కాలాన్ని మూడు నెలల పాటు పొడిగిస్తుందనే వార్తలు వినిపించాయి. ఇదివరకు రిజర్వుబ్యాంకు విడుదల చేసిన ఓ ప్రకటన కూడా ఇదే అభిప్రాయాన్ని కలిగించింది. వాటన్నింటినీ కేంద్రం కొట్టి పారేసినట్టయింది. ఆర్థిక సంవత్సర ఆరంభం.. ముగింపుల్లో ఎలాంటి తేడా ఉండదని పేర్కొంది.