వ్యవస్థలో దొంగనోట్లు చలామణి పెరిగిపోతోంది: ఆర్బీఐ రిపోర్ట్
ఢిల్లీ: వ్యవస్థలోకి దొంగ నోట్లు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా . వార్షిక నివేదికను విడుదల చేసిన ఆర్బీఐ.. రూ.500, రూ.2వేల కరెన్సీలు దొంగనోట్లు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పుకొచ్చింది. 2017-18లో దొంగనోట్లను పసిగట్టడంలో అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 31.4శాతం తక్కువకు పడిపోయిందని ఆర్బీఐ అభిప్రాయపడింది. 2017-18లో 5లక్షల22వేల 783 దొంగ నోట్లు బయటపడితే... అంతకు ముందు అంటే 2016-17లో ఆ సంఖ్య 7 లక్షల 62వేల 72గా ఉన్నిందని చెప్పింది.
2018 ఆర్థిక సంవత్సరంలో రెండు వేల రూపాయల దొంగ నోట్లు 17,929 పీసులు బయటపడినట్లు చెప్పింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 638 దొంగ రెండువేల నోట్లను కనుగొన్నారని గుర్తు చేసింది ఆర్బీఐ. ఇక ఐదువందల రూపాయల దొంగ నోట్లు 9,892 పీసులు 2017-18 ఆర్థిక సంవత్సరంలో బయటపడగా... 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 199 ఐదువందల దొంగనోట్లు మాత్రమే బయటపడ్డట్లు ఆర్బీఐ నివేదికలో పొందుపర్చింది. పెద్దనోట్ల రద్దుతో దొంగనోట్లు వ్యవస్థలోకి రావని ఆనాడు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.
పెద్దనోట్ల రద్దు తర్వాత వచ్చిన కొత్త రూ.500 నోట్లు, రూ.2000 నోట్లు...నకిలీవిగా తయారు చేయలేమని అవి చాలా భద్రతతో కూడి ఉంటాయని ఆర్బీఐ చెప్పడంలో పూర్తిగా వాస్తవం కాదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడింది. ఆర్బీఐతో పాటు మిగతా బ్యాంకులు కూడా దొంగనోట్ల చలామణిపై ఒక కన్నువేసి ఉంచాలని.. భవిష్యత్తులో అవి మరింత పెరిగే అవకాశముందని ఎస్బీఐ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం నకిలీ నోట్లను తయారు చేసే వారి దృష్టంతా పెద్ద నోట్లపైనే పడటంతో అంటే రూ.2వేల నోట్లపైనే పడటంతో రూ.500 నకిలీ నోట్లు తగ్గిపోయాయని హెచ్డీఎఫ్సీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
పెద్ద నోట్ల రద్దు చేయడం ద్వారా నల్లడబ్బును అరికట్టడమే కాకుండా దొంగనోట్లకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రధాని 2016 నవంబర్ 8న చెప్పారు. అప్పటి రూ.500 నోట్లు, రూ.1000నోట్లలో సరైన భద్రతాచర్యలు లేకపోవడం వల్ల గూఢచర్యం, మారణాయుధాల స్మగ్లింగ్, డ్రగ్స్ లాంటివి భారత్లో ఎక్కువగా ఉండేవని... ఆ నోట్ల రద్దు తర్వాత కొత్తగా భద్రతా ప్రమాణాలతో వచ్చిన నోట్లతో ...నేరాలు తగ్గుముఖం పడతాయని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు.