నకిలీ యూనివర్సిటీలు .. ఫేక్ డాక్టరేట్ లు ... పైసల కోసం గలీజ్ దందా
డాక్టరేట్... ఎంతో గౌరవప్రదమైన డిగ్రీ. విద్యార్థులు ఏళ్ళతరబడి చదివి డాక్టరేట్ పట్టా తీసుకుంటుంటే, వివిధ విభాగాల్లో ప్రముఖులు, పలు రంగాల్లో అత్యున్నత సేవలు అందించిన వారికి గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తాయి పలు యూనివర్సిటీలు . అయితే అలాంటి గౌరవ డాక్టరేట్ల విశిష్టమైన పట్టాకు విలువ లేకుండా చేస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. నకిలీ యూనివర్సిటీలను పెట్టి, డబ్బులు తీసుకొని గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేస్తున్నారు. అత్యంత గౌరవప్రదమైన డాక్టరేట్లను సంతలో కూరగాయలను అమ్మినట్టు అమ్ముతున్నారు.
కపుల్ ఛాలెంజ్,బ్యూటీఫుల్ డాటర్ ఛాలెంజ్..ఆ ఫోటోలు మార్ఫ్ చేసి అశ్లీల సైట్లలో..సైబర్ క్రైం హెచ్చరిక
పదివేలు ఇస్తే చాలు గౌరవ డాక్టరేట్
ఈ నకిలీ యూనివర్సిటీలపై, వారు సాగిస్తున్న దందాపై దృష్టిసారించిన పోలీసులు అసలు జరుగుతున్న భాగోతం తెలిసి అవాక్కయ్యారు.కేవలం పదివేల రూపాయలు ఇస్తే చాలు , ఎలాంటి అర్హత ఉండనవసరం లేదు. ఎలాంటి సేవలు చేయనవసరం లేదు. డాక్టరేట్ డిగ్రీ ప్రదానం చేస్తారు నకిలీ యూనివర్సిటీల నిర్వాహకులు. సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకొని, ఏజెంట్ల ద్వారా ప్రచారం చేసుకుని ఫేక్ డాక్టరేట్లను యదేచ్ఛగా విక్రయిస్తున్నాయి సదరు నకిలీ యూనివర్సిటీలు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాలలో కూడా ఈ నకిలీ దందా జోరుగా సాగుతోంది.
ఫేక్ డాక్టరేట్ ల దందాపై రంగంలోకి దిగిన కర్ణాటక పోలీసులు
కాసుకు కొరగాని వాళ్లకు సైతం గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేస్తున్నారు. నకిలీ యూనివర్సిటీలపై, ఫేక్ డాక్టరేట్ లపై దృష్టిసారించిన కర్ణాటక పోలీసులు రంగంలోకి దిగారు. ఎవరెవరికి ఏఏ యూనివర్సిటీలలో నకిలీ డాక్టరేట్ లు ఇచ్చారు అన్నదానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మూడు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ ఈ దందాకు తెరలేపింది అని గుర్తించారు. తాజాగా ఈ యూనివర్సిటీ కర్ణాటకలోని మైసూర్ లో వంద మందికి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసే కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు.
ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ నకిలీ డాక్టరేట్ ల దందాను అడ్డుకున్న పోలీసులు .. నిర్వాహకులు అరెస్ట్
డబ్బులు తీసుకుని డాక్టరేట్లను ప్రదానం చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో అక్కడకు వెళ్లిన పోలీసులు అక్కడ జరుగుతున్న తంతు చూసి అవాక్కయ్యారు. కార్యక్రమ నిర్వాహకులను అదుపులోకి తీసుకొని ఫేక్ డాక్టరేట్ ల డొంక కదిలించారు. పాండిచ్చేరి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఫేక్ యూనివర్సిటీలు ఈ నకిలీ దందా సాగిస్తున్నట్లుగా గుర్తించారు . దక్షిణాది రాష్ట్రాలలో ప్రతి జిల్లాలో వందల సంఖ్యలో ఈ నకిలీ డాక్టరేట్లు పొందిన వారున్నారని పోలీసుల దర్యాప్తులో గుర్తించారు.
దేశ వ్యాప్తంగా ఇబ్బడి ముబ్బడిగా నకిలీ యూనివర్సిటీల దందా
కోయంబత్తూరు, చెన్నై, బెంగళూరు, మైసూర్, పాండిచ్చేరి కేంద్రాలుగా యూనివర్సల్ పీస్ యూనివర్సిటీ అమెరికా, మలేషియా లింకో క్వింగ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ గ్లోబల్ ఆక్స్ ఫర్డ్ , గ్లోబల్ పీస్ యూనివర్సిటీ కొన్నేళ్లుగా నకిలీ డాక్టరేట్ లను ప్రదానం చేస్తూ కోట్లాది రూపాయలు దందా చేస్తున్నట్లుగా గుర్తించారు.
ఇక డాక్టరేట్లు ఇవ్వడం కోసం 10 వేల నుంచి 50 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు గా గుర్తించారు.
Recommended Video
తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ జిల్లాలో ఈ ఫేక్ డాక్టరేట్లు
ఇక ఈ యూనివర్సిటీలు అందించే డాక్టరేట్ ల కోసం రాజకీయ నాయకులు, అధ్యాపకులు, సంఘ సేవకులు, రియల్టర్లు, బిల్డర్లు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఇలా అన్ని వర్గాల వారు ఉన్నట్టు సమాచారం. ఇప్పటిదాకా పది యూనివర్సిటీలలో డాక్టరేట్లు పొందిన వారి జాబితా మైసూర్ పోలీసుల చేతికి చిక్కడంతో ఈ నకిలీ యూనివర్సిటీల బాగోతం తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. ముఖ్యంగా ఈ దందాలో గౌరవ డాక్టరేట్ లు పొందిన వారు ఎక్కువమంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కావడం గమనార్హం.