నిజం కంటే అబద్దానికి వేగం ఎక్కువ : ‘బీజేపీ’లోగో వివాదంపై జ్యోతిరాదిత్య సింధియా
భోపాల్: తన ట్విట్టర్ ప్రొఫైల్లో 'బీజేపీ' లోగోను తీసేశారంటూ వస్తున్న వార్తలను బీజేపీ నేత, గుణ మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా కొట్టిపారేశారు. నిజాల కంటే తప్పుడు వార్తలు వేగంగా వ్యాపిస్తాయని, ఇది చాలా విచారకరమని ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
సీఎంతో విభేదాలు, కేంద్రమంత్రి పదవి ఇవ్వలేదంటూ..
జ్యోతిరాదిత్య సింధియా తన ట్విట్టర్ ఫ్రొఫైల్ నుంచి బీజేపీ లోగోను తీశారని విస్తృత ప్రచారం జరిగింది. దీంతో అనేక ఊహాగానాలు వ్యాప్తి చెందాయి. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్కు సింధియాకు మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని, అంతేగాక, సింధియాకు కేంద్రమంత్రి పదవి ఇవ్వలేదనే ఇలా చేశారంటూ ప్రచారం జరిగింది.
అసత్యాల ప్రచారానికి వేగం ఎక్కువ..
ఈ నేపథ్యంలో జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. తన ట్విట్టర్ ప్రొఫైల్ లో ఎలాంటి మార్పులు చేయలేదని, ఇంతకుముందు ఉన్నట్లుగానే ఉందని.. అసత్యాల ప్రచారం వేగంగా జరిగిందని సింధియా అన్నారు. అవాస్తవ, తప్పుడు ప్రచారాలను ప్రజలు పట్టించుకోకుండా ఉంటే మంచిదని అన్నారు. మీడియా కూడా కొంచెం అతిగా స్పందించిందని, వాటిలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు.
బీజేపీలో చేరినప్పుడు ఎలానో.. ఇప్పుడూ అలాగే.. కానీ..
బీజేపీలో తాను చేరినప్పుడు తన ట్విట్టర్ ప్రొఫైల్ ఎలావుందో.. ఇప్పుడు కూడా అలానే వుందని సింధియా స్పష్టం చేశారు. ఒక ఫొటో మాత్రమే మార్చానని తెలిపారు. సింధియాపై జరిగిన తప్పుడు ప్రచారంపై బీజేపీ నేతలు కూడా మండిపడ్డారు. సింధియా ట్విట్టర్ ప్రొఫైల్ మార్చి వేశారంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని బీజేపీ సీనియర్ నేత ప్రధ్యుమన్ సింగ్ తోమర్ తెలిపారు.
Recommended Video
ప్రధాని ఆశీస్సులతో బీజేపీలోకి..
కాగా, కాంగ్రెస్ పార్టీలో 18ఏళ్లపాటు కొనసాగిన జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనతోపాటు 22 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరారు. దీంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత శివరాజ్ సింగ్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలున్నప్పటికి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతల వ్యవహారంతో విసిగిపోయిన సింధియా చివరకు ఆ పార్టీని వీడారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో సింధియా బీజేపీలో చేరారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులు తీసుకున్నారు.