కరోనా భయంతో ఖాళీ అవుతున్న గ్రామాలు: ఇళ్లను వదిలేసి.. పొలాల్లో బిక్కుబిక్కుమంటూ.. !
బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ బీభత్సాన్ని సృష్టిస్తోంది. బెంగళూరు వంటి నగరాలు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. సాఫ్ట్వేర్ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని ఇవ్వడంతో స్వస్థలాలకు తరలివెళ్లారు ఉద్యోగులు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాలు సైతం ఖాళీ అయ్యే పరిస్థితి అక్కడ ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం.. కరోనా వైరస్ భయం. ఈ మహమ్మారి భయంతో కొన్ని గ్రామాల ప్రజలు పెట్టే, బేడా సర్దుకుంటున్నారు. పిల్లా, పాపలతో పొలాల్ల తలదాచుకుంటున్నారు.
Recommended Video
కర్ణాటకలోని తుమకూరు జిల్లా ముద్దెనహళ్లిలో తాజాగా ఈ ఉదంతం చోటు చేసుకుంది. ముద్దెనహళ్లికి చెందిన కొన్ని కుటుంబాలు రెండు, మూడురోజులుగా తమ పొలాల్లో నివసిస్తున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా గుడారాలను వేసుకున్నాయి. వంట వండుకోవడానికి అవసరమైన సామాగ్రిని తీసుకుని వెళ్లి పొల్లాల్లో మకాం వేశాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్డౌన్ను ప్రకటించినప్పటికీ..ఆ మహమ్మారికి అడ్డుకట్ట పడట్లేదనే అనుమానంతోనే వారంతా ఇళ్లను వదిలి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఎండలో ఆరుబయట నిద్రించడం వల్ల వైరస్ సోకదనే ఉద్దేశంతోనే వారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక రెవెన్యూ అధికారులు వారిని కలుసుకున్నారు. ఆరు బయట నిద్రించడం వల్ల వైరస్ సోకే ప్రమాదం మరింత తీవ్రంగా ఉందని వివరించారు. ఇళ్లల్లోనే నివసించాలని సూచించారు. లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో ఆరుబయట తిరుగాడటం, నిద్రించడం వంటి పనులు ఉల్లంఘన కిందికి వస్తాయని, కఠిన చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీనితో వారంతా మళ్లీ ఇళ్లకు చేరుకున్నారు.
కరోనా వైరస్ తీవ్రత కర్ణాటకలో భారీగా ఉంటోంది. బెంగళూరు సహా దాదాపు అన్ని జిల్లాల్లోనూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అత్యధికంగా బెంగళూరులో 71 కేసులు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విధించడానికి ముదే కర్ణాటకలో లాక్డౌన్ను అమలులోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ.. వైరస్ కేసులు పెద్ద ఎత్తున ప్రబలుతున్నాయి. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువే అయినప్పటికీ.. క్రమంగా పెరుగుతుండటం అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.