కరోనా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయలేం, పరిహారం చెల్లించలేం: రాసిచ్చిన మోడీ సర్కార్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకు తెలిసు. వేలాది మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఆక్సిజన్ అందక, ఆసుపత్రుల్లో పడకలు చాలక మృత్యువాత పడ్డారు. ఒక దశలో రోజువారీ కరోనా మరణాల సంఖ్య నాలుగు వేలకు పైగా నమోదయ్యాయి. నాలుగు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సందర్భాలు ఉన్నాయి. మొత్తంగా 3,86,713 మంది మృత్యువాత పడ్డారు. ఇది ఇక్కడితో ఆగేలా కూడా కనిపించట్లేదు. మరిన్ని మరణాలు నమోదు కావనడానికి గ్యారంటీ లేదు. కరోనా మరణాల సంఖ్య తగ్గిందే తప్ప.. పూర్తిగా స్తంభించిపోలేదు.
కేంద్రానికి నోటీసులు..
ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా- కరోనా బారిన పడి అన్ని విధాలుగా నష్టపోయిన వారి కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని గానీ, ఆర్థిక సహాయాన్ని గానీ అందజేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఆ మేరకు పరిహారాన్ని చెల్లించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్లు దాఖలయ్యాయి. దీన్ని విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులను జారీ చేసింది. తన వైఖరేమిటో స్పష్టం చేయాలని, దాన్ని అఫిడవిట్ రూపంలో అందజేయాలని ఆదేశించింది.
సుప్రీంకు అఫిడవిట్..
దీనికి అనుగుణంగా కొద్దిసేపటి కిందటే- కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్ను సుప్రీంకోర్టుకు అందజేసింది. కరోనా బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల రూపాయల మేర నష్ట పరిహారాన్ని చెల్లించలేమని స్పష్టం చేసింది కేంద్రం. కరోనా మరణాలు ప్రకృతి వైపరీత్యాల కిందికి రాబోవని తేల్చి చెప్పింది. అలాంటి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడానికి అనేక పథకాలను తెచ్చామని తెలిపింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో బాధితులకు పరిహారాన్ని చెల్లించడానికి ఉద్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలు- కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభం పరిధిలోకి రావని కుండబద్దలు కొట్టింది.
అవి ప్రకృతి వైపరీత్యాల పరిధిలోకి రాబోవని..
కరోనా సంక్షోభం.. భూకంపాలు, వరదలు, తుఫాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాల కిందికి రాదని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో 183 పేజీల అఫిడవిట్ను దాఖలు చేసింది. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయని తెలిపింది. 3.85 లక్షల మంది కరోనా బారిన పడి మరణించారని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా కేంద్ర ప్రభుత్వం.. సుప్రీంకోర్టుకు అందజేసిన అఫిడవిట్లో పేర్కొంది. దురదృష్టకరమైన సంఘటనలుగా కరోనా మరణాలను అభివర్ణించింది.
Recommended Video
ఆర్థిక ఇబ్బందులున్నాయ్..
కరోనా సంక్షోభ సమయంలో వైద్యరంగంపై భారీ ఎత్తును ఖర్చు చేయాల్సి వచ్చిందని, అదే సమయంలో లాక్డౌన్ తరహా పరిస్థితుల వల్ల రాబడి తగ్గిందని తెలిపింది. ప్రభుత్వ వ్యవహారాలో జోక్యం చేసుకోలేమంటూ సుప్రీంకోర్టు ఇదివరకు చేసిన ప్రకటనను కూడా కేంద్రం గుర్తు చేసింది. కరోనా మరణాలు సంభవించినప్పుడు దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను జారీ చేయడంలో అవకతవకలకు పాల్పడే డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని కూడా కేంద్రం హెచ్చరించింది.