ఆర్టికల్ 370 ఎఫెక్ట్ : ఆ జైలులో కశ్మీరీలు..వారికోసం ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులు
ఆగ్రా: జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కొందరి ఆందోళనకారులను ముందస్తు జాగ్రత్తచర్యల్లో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇలా మొత్తం 285 మందిని పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని అందులో 85 మందిని ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రా జైలుకు తరలించారు. తాజాగా మరో 29 మందిని ఆగ్రా జైలుకు తరలించారు.
కశ్మీర్ నుంచి ఆగ్రాకు కొడుకును చూసేందుకు వెళ్లిన గులామ్
ఇలా పుల్వామా నివాసి అయిన గులామ్ ఆగ్రా జైలులో ఉన్న తన కొడుకును చూసేందుకు వెళ్లాడు. తన కొడుకు ఆగష్టు తొలివారం నుంచి సెంట్రల్ జైలులో ఉన్నాడు. ఆయన మతబోధకుడు. అయితే గులామ్ ఆగ్రా చేరుకునేందుకు ముందుగా శ్రీనగర్ వచ్చాడు. అక్కడి నుంచి ఢిల్లీకి ఆ తర్వాత ఆగ్రాకు చేరుకున్నాడు. అంత ప్రయాసపడి అంత దూరం తన కొడుకును చూసేందుకు వచ్చిన గులామ్కు నిరాశే మిగిలింది. జమ్మూకశ్మీర్ పోలీసుల నుంచి నిర్ధారణ లేఖ లేకపోవడంతో తన కొడుకును కలిసేందుకు గులామ్ను పోలీసులు అనుమతించలేదు.
ఒక్క లెటర్ కోసం మళ్లీ కశ్మీర్కు వెళ్లాలా..?
తన కొడుకును చూసేందుకు రూ.20వేలు ఛార్జీలు పెట్టకుని వచ్చామని ఆవేదన వ్యక్తం చేశాడు గులామ్. కశ్మీర్లో ఫోన్లు, ఇంటర్నెట్ పనిచేయడం లేదని తన కొడుకు ఎలా ఉన్నాడో అన్న ఆందోళన నెలకొందని చెప్పాడు. కేవలం ఒక్క లెటర్ కోసం తిరిగి జమ్మూ కశ్మీర్కు వెళ్లి మళ్లీ అంత భారీ స్థాయిలో ఛార్జీలు పెట్టుకుని రావడం తమలాంటి వారికి చాలా కష్టమని గులామ్ కన్నీరుమున్నీరయ్యాడు. తన కొడుకు ఓ రాజకీయపార్టీలో ఉన్నాడని అయితే అతనిపై ఎలాంటి చట్టవ్యతిరేక కేసులు లేవని గుర్తుచేశాడు. ఆగష్టు 5న ఇద్దరు పోలీసులు వచ్చి తన కొడుకును తీసుకెళ్లిపోయారని ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు రెండు నెలల కూతురు ఉందని తండ్రికోసం ఎదురుచూస్తోందని చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యాడు గులామ్.
వివిధ వృత్తిలో కొనసాగుతున్న అరెస్టయిన వారు
జైలు అధికారులు చెబుతున్న ప్రకారం అరెస్టు అయినవారిలో చాలామంది వయస్సు 18 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉందని చెప్పారు. కొందరు మాత్రం 50 ఏళ్లు పైబడి ఉన్నారని తెలిపారు. వీరందరూ ఒక్కో వృత్తిలో ఉన్నారని చెప్పిన పోలీసులు కొందరు రాజకీయపార్టీలలో కొనసాగుతుండగా, మరి కొందరు కాలేజ్ విద్యార్థులు అని చెప్పారు. ఇంకొందరు పీహెచ్డీ చేస్తుండగా మరికొందరు మతబోధకులు, కొందరు టీచర్లు, కొందరు బిజినెస్ చేసుకుంటున్నారని పోలీసులు చెప్పారు. అరెస్టు అయిన వారిలో కశ్మీరీ యువతకోసం వాదించే సుప్రీం కోర్టు న్యాయవాది కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
కశ్మీరీల కోసం జైలులో ప్రత్యేక ఏర్పాట్లు
కశ్మీర్లో అరెస్టు అయిన వారికోసం ప్రత్యేక బ్యారికేడ్లను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు ఖైదీలు కుటుంబ సభ్యులు కలిసేందుకు సాధారణ ఖైదీల్లా కాకుండా వారికి మరో సమయం కేటాయిస్తామని తెలిపారు. అది కూడా అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటేనే అనుమతిస్తామని జైలు అధికారులు స్పష్టం చేశారు. కశ్మీరీ ఖైదీలకు ఇతర సాధారణ ఖైదీల్లానే భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జైలు ప్రాంగణంలోనే తిరిగేందుకు అనుమతించినట్లు పోలీసులు తెలిపారు.