విదేశీయులంటూ జైల్లోకి- ఏడాది తర్వాత మనోళ్లేనంటూ విడుదల- ఎన్నార్సీ విచిత్రం
దేశంలో జాతీయ పౌర పట్టిక (ఎన్సార్సీ) అమలుపై గతేడాది కరోనా ముందు వరకూ తీవ్ర కలకలం రేగింది. దేశంలోనే పుట్టినప్పటికీ సరైన పత్రాలు చూపడంలో విఫలమైతే మాత్రం విదేశీయులుగా, అక్రమ చొరబాటు దారులుగా గుర్తించి వేల సంఖ్యలో జనాన్ని అదుపులోకి తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఇదంత పెద్ద సమస్య కాదని చెబుతూ వచ్చిన కేంద్రం ఇప్పటికీ దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయలేని పరిస్ధితుల్లో ఉంది. దీనికి ప్రధాన కారణం ఇప్పటికీ బయటపడుతున్న వైఫల్యాలే. ఏడాదిన్నర క్రితం అసోంలో ఎన్నార్సీ అమలు సందర్భంగా అదుపులోకి తీసుకున్న ఓ జంటను తాజాగా మనోళ్లేనని గుర్తించి వదిలిపెట్టారు.
అసోంలో ఎన్సార్సీ అమలు..
దేశంలో తొలిసారిగా ఈశాన్య రాష్ట్రమైన అసోంలో ఎన్సార్సీని అమలు చేశారు. స్ధానికతకు సంబంధించి సరైన పత్రాలు చూపించడంలో విఫలమయ్యారన్న కారణంతో లక్షలాది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో విదేశాలకు వెళ్లిపోయేందుకు అంగీకరించిన వారిని పంపేసి మిగిలిన వారిని మాత్రం జైళ్లకు పంపారు.
ఇప్పటికీ విదేశీయుల ట్రైబ్యునల్ ఈ కేసులను విచారిస్తూనే ఉంది. వీటిపై వివాదాలు తీవ్రం కావడంతో కేంద్రం ఇతర రాష్ట్రాల్లో సైతం దీన్ని అమలు చేయలేని పరిస్ధితుల్లో నిలిచింది. అసోంలోనూ గతంలో విదేశీయుల పేరుతో నిర్బంధించిన వారిని సైతం ట్రైబ్యునల్ వదిలిపెట్టాల్సిన పరిస్దితి తలెత్తుతోంది.
చొరబాటుదారులంటూ జంట నిర్భంధం
ఇదే కోవలో ఎన్సార్సీ అమలు సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటన తాజాగా బయటపడింది. విదేశీయుల పేరుతో ఏడాదిన్నర క్రితం ఓ ముస్లిం జంటను అదుపులోకి తీసుకున్నారు. 34 ఏళ్ల మొహమ్మద్ నూర్ హుస్సేన్, ఆయన భార్య 26 ఏళ్ల సహేరా బేగంను సరైన పత్రాలు చూపించలేదనే కారణంతో అదుపులోకి తీసుకున్నాక 2018 మే నెలలో వీరిద్దరినీ విదేశీయుల ట్రైబ్యునల్ చొరబాటుదారులుగా తేల్చింది.
దీంతో జైలుకు తరలించారు. ఏడాదిన్నరగా వీరు తాము అసోం వాసులమేనంటూ తమ తండ్రులు, తాతలకు సంబంధించిన పలు ఆధారాలు చూపిస్తున్నా ట్రైబ్యునల్ ఈ వ్యవహారం తేల్చలేకపోయింది. దీంతో వీరు జైల్లోనే నలిగిపోవాల్సిన పరిస్ధితి.
విదేశీయుల ట్రైబ్యునల్ తీర్పుతో విడుదల
నూర్ హుస్సేన్, సహేరాను గతేడాది జూన్లో జైలుకు తరలించడంతో వీరి పిల్లలు అనాథలయ్యారు. ఏడేళ్ల కుమారుడు షాజహాన్ను స్కూలు నుంచి పంపేశారు. దీంతో వీరిని కూడా ఈ దంపతులు డిటెన్షన్ సెంటర్కు తీసుకెళ్లాల్సి వచ్చింది. తొలుత వీరి తరపున వాదించేందుకు లాయర్లు కూడా దొరకలేదు. ఎలాగోలా తిప్పలు పడి బంధువుల సాయంతో లాయర్లను మాట్లాడుకుని అసోం హైకోర్టులోనూ, విదేశీయుల ట్రైబ్యునల్లోనూ తమ వాదనలు వినిపించారు. చివరికి వీరిని అసోం వాసులుగానే గుర్తిస్తూ విదేశీయుల ట్రైబ్యునల్ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏడాదిన్నర తర్వాత వీరు సొంతింటికి చేరారు.
2 లక్షల కేసుల పరిష్కారం
గతేడాది జూన్ నాటికి అక్రమ విదేశీయుల పేరుతో నిర్బంధంలోకి తీసుకున్న వారికి సంబంధించి విదేశీయుల ట్రైబ్యునల్కు 4.34 లక్షల కేసులు వచ్చాయి. వీటిలో ఇప్పటివరకూ 2 లక్షల కేసులు పరిష్కారమయ్యాయి. ఇంకా జైళ్లలో మగ్గుతున్న వారి సంఖ్య కూడా లక్షల్లోనే ఉంది. వీరంతా నూర్ హుస్సేన్, సహేరే తరహాలో ఎప్పుడు బయట పడతారో తెలియని పరిస్ధితి. సుదీర్ఘంగా సాగుతున్న న్యాయప్రక్రియకు తోడు లీగల్ ఖర్చులకు డబ్బులు వెచ్చించే పరిస్ధితి వీరిలో చాలా మందికి లేదు. దీంతో వీరిలో ఎందరు ఇంకెన్నాళ్లు డిటెన్షన్ సెంటర్లలో నలిగిపోవాలో తెలియని పరిస్ధితి నెలకొంది.