'ఎయిడ్స్ రోగి శవం' : శశ్మానంలోకి నిరాకరణ, ఇంటి ఎదుటే దహనం
బాలాసోర్ : ఒడిశాలో మరో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఎయిడ్స్ తో చనిపోయాడన్న కారణంతో ఓ వ్యక్తి మృతదేహాన్ని గ్రామ శ్మశానంలో దహనం చేసేందుకు గ్రామస్తులంతా ఏకమై ససేమిరా అన్నారు. దీంతో దిక్కులేని స్థితిలో తమ ఇంటి ప్రాంగణంలోనే శవానికి అంత్యక్రియలు జరిపించుకుంది బాధిత కుటుంబం.
ఒడిశాలోని బాలాసోర్ టెంటై గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇంటి ఆవరణలో శవాన్ని దహనం చేస్తోన్న సమయంలో కొంతమంది అధికారులు కూడా అక్కడే ఉన్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. విషయం బయటకు పొక్కనివ్వకుండా గ్రామస్థులంతా జాగ్రత్తపడ్డ.. అసలు నిజం మాత్రం బయటకొచ్చింది.
ఘటనానంతరం బాధిత కుటుంబానికి హరిశ్చంద్ర పథకం కింద రెండు వేల రూపాయల నష్ట పరిహారాన్ని అందజేసింది ప్రభుత్వం. కాగా, శ్మశానికి అనుమతించని గ్రామస్తులపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. 35ఏళ్ల వయసులోనే తమవాడిని పోగొట్టుకుని తీవ్ర వేదనలో ఆ కుటుంబానికి గ్రామస్తుల చర్య మరింత ఆవేదనకు గురిచేసేదిగా మారింది.