మిసైల్ మ్యాన్ కలాం ఆస్తులు, ఎవరికి?
బెంగళూరు: మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం ఆస్తులు ఎవరికి చెందుతాయనే విషయంపై చర్చ సాగుతోంది. అబ్దుల్ కలాం వీలునామా వ్రాయకపోవడంతో ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి అని పలువురు ఆరా తీస్తున్నారు. ఆ ప్రశ్నకు సమాధానం చిక్కింది.
అబ్దుల్ కలాం ఆస్తులు ఆయన పెద్ద అన్నయ్య మహమ్మద్ ముత్తు మీరా లెబై (99)కి చెందుతాయని కలాం కుటుంబ సభ్యులు అంటున్నారు.
వీలునామా వ్రాయమంటే..............!
వీలునామా వ్రాయాలని ఆయనకు అనేక సార్లు చెప్పామని కుటుంబ సభ్యులు అన్నారు. అయితే అబ్దుల్ కలాం ఆ విషయంపై ఎక్కువ పట్టించుకోలేదని, ఎక్కువ మాట్లాడలేదని వారు అంటున్నారు.
అందు వలన వీలునామా లేకపోవడంతో కుటుంబ పెద్దకు కలాం ఆస్తులు అప్పగిస్తారని కుటుంబ సభ్యులు అంటున్నారు. కలాంకు ఉన్న పెద్ద ఆస్తులు అంటే ఆయన పుస్తకాలు, వీణ, ఒక ల్యాప్ టాప్, చేతి గడియారం, రెండు బెల్ట్ లు, సీడీ ప్లేయర్, ఆయనకు ఇష్టం అయిన నీలి రంగు డ్రస్ లు అని కుటుంబ సభ్యులు చెప్పారు.
న్యూఢిల్లీలోని రాజాజీ మార్గ్ లోని కలాం ఇంటికి ఇప్పటికే తాళం వేశారు. ఆ ఇంటిలో ఉన్న వస్తువులను కలాం కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నామని ఆయన సన్నిహితుడు అంటున్నారు.
పుస్తకాలు, రాయల్టీ.........., నిత్యం సహాయం........!
భారతదేశంలోని ప్రముఖ రచయితలలో కలాం ముందు వరుసలో ఉంటారు. ఆయన వ్రాసిన పుస్తకాలు అన్ని ఆయన పెద్ద అన్నయ్యకు అప్పగిస్తారు. ఆ పుస్తకాల రైట్స్, రాయల్టీ హక్కులు ఆయనకే చెందుతాయి. కలాం చివరి రోజుల వరకు ఆయన కుటుంబ సభ్యులకు నిత్యం సహాయం చేశారు.
కలాం బెంగళూరు నగరంలో ఒక ఇంటి స్థలం కొనుగోలు చేశారు. ఆ స్థలాన్ని 2013లో మనుమడు (అన్న మనుమడు)కు గిఫ్ట్ కింద అందించారు. కుటుంబ సభ్యులకే కాకుండ ఆయన దగ్గర, కార్యాలయంలో పని చేసిన వారికి కూడా సహాయం చేశారు.
తనకు చేతనైన సహాయం చెయ్యడం ముందు నుంచి కలాంకు అలవాటని ఆయన సన్నిహితులు అంటున్నారు. అంతే కాకుండా రంజాన్ పండుగ సందర్బంగా నిర్వహించే జమాత్ లో ప్రతి సంవత్సరం రూ. ఒక లక్షను కలాం ఇచ్చేవారని సన్నిహితులు తెలిపారు.