అభిమానం ముంచింది: ఈ చందమామ కోసం ఎంత పోగొట్టుకున్నాడో తెలుసా...?
చెన్నై: అభిమానం వ్యక్తిని ఎంతదూరమైనా తీసుకెళుతుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశపు ప్రజలకు సినిమాలన్నా ఆ సినిమా నటులన్నా ఎంతో పిచ్చి. వారికోసం ఏం చేసేందుకైనా వెనుకాడరు. ఉదాహరణకు సూపర్ స్టార్ రజనీకాంత్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే వేరు. మెగస్టార్ చిరంజీవికి కూడా అంతే స్థాయిలో అభిమానులు ఉన్నారు. స్టార్స్ కూడా అభిమానులు లేనిదే తాము లేమంటూ పలు సందర్భాల్లో చెబుతుంటారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే వారి అందాన్ని ఆరాధించే అభిమానులు కోకొల్లు. ఇక హీరోయిన్లకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. వారికోసం గుళ్లు గోపురాలు కూడా కట్టేసి దేవతలా పూజిస్తుంటారు. అలాంటి ఓ పిచ్చి అభిమాని స్టార్ హీరోయిన్ కాజల్ను కలవాలని చెప్పి మోసపోయాడు. కోరిక తీరకపోవడం పక్కనబెడితే డబ్బులు మాత్రం భారీగా పోగొట్టుకున్నాడు.
తమిళనాడు రాష్ట్రం రామనాథ పురంకు చెందిన ఓ వ్యక్తికి కాజల్ అంటే పిచ్చి అభిమానం. ఆమెను ఏనాటికైనా సరే కలిసి ఆమెతో ఫోటో దిగాలనే పిచ్చి కోరిక ఉండేది ఆ అభిమానికి .దీన్నే కొందరు కేటుగాళ్లు ఆసరా చేసుకుని మోసం చేశారు. కాజల్ను ఎలా కలవొచ్చో అనేదాని గురించి ఈ అభిమాని ఇంటర్నెట్లో వెతికాడు. అయితే అదే సమయానికి స్టార్ హీరోయిన్లను తాము కల్పిస్తామని అయితే ఇందుకు ఛార్జ్ తీసుకుంటామని చెప్పారు. డబ్బులే కదా.. అక్కడ ఉండేది కాజల్.. ఆమెను కలిసేందుకు ఎంత డబ్బులైన ఖర్చు పెట్టేందుకు తయారైపోయాడు ఈ పిచ్చి అభిమాని. ఇక ఆ ఫేక్ వెబ్పేజ్లోకి వెళ్లి ముందుగా పూర్తి వివరాలు తెలపాలని అందులో ఉంది. ఆ తర్వాత రూ.50వేలు కట్టాలని ఉంది. ఇక వివరాలు పూర్తి చేశాక, రూ. 50వేలు డబ్బులు కట్టేశాడు.
ఇక ఈ దోపిడీ అంతటితో ఆగలేదు... మళ్లీ డబ్బులు కట్టమన్నారు. కట్టేశాడు. కానీ కాజల్ను ఎలా కలవాలి ఎప్పుడు కలవాలి అనే వివరాలు మాత్రం ఇవ్వలేదు. ఇక ఆ తర్వాత ఆ అభిమాని తాను మోసపోయినట్లు గ్రహించాడు. ఇక ఆ గ్యాంగ్ అంతటితో ఆగలేదు. ఈ అభిమాని అసభ్యకరంగా ఉన్న వీడియోలు పోస్టు చేస్తామని బెదిరించి డబ్బులు గుంజింది. మొత్తం రూ.60 లక్షలు ఈ అభిమాని నుంచి తీసుకుంది. ఇక మనస్తాపానికి గురైన అభిమాని ఇళ్లు వదిలి పారిపోయాడు. చివరకు కోల్కతాలో పోలీసులు పట్టుకుని విచారణ చేయగా జరిగిన విషయం చెప్పాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నిర్మాత శ్రావణ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.