దూసుకొస్తున్న ఫొని.. ఈ నెల 30న తీరం దాటే అవకాశం..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తుఫానుగా మారింది. ఇది సోమవారం నాటికి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫొనిగా నామకరణం చేసిన ఈ తుఫాను ప్రభావం మే ఐదో తేదీ వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ నెల 30న ఫొని దిశమార్చుకుని బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
ఫణి తుఫానుతో కోస్తాంధ్రకు భారీ వర్షాలు : వాతావరణ శాఖ
కొస్తా తీరం వెంట ఫొని ప్రయాణం
మే ఒకటో తేదీ నుంచి నాల్గో తేదీ వరకు ఆంధ్ర ప్రదేశ్ తీరానికి 200 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఫొని ప్రయాణించి అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ తుఫాను ఒడిశా తీరానికి దగ్గరగా వెళ్లి బంగ్లాదేశ్ వైపు కుదులుతుందని అంచనా వేస్తున్నారు.
గంటకు 170.కి.మీ వేగంతో గాలులు
ఫొని కారణంగా సోమ, మంగళవారాల్లో కేరళలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు ఐఎండీ చెబుతోంది. తమిళనాడు, కోస్తాంధ్రలో ఏప్రిల్ 30, మే 1న పలుచోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. తుఫాను ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రస్తుతం 80 నుంచి 100 కి.మీ. వేగంతో గాలులు వీస్తుండగా.. సోమవారానికి గాలుల వేగం 145 నుంచి 170కి.మీలకు పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మంగళవారం రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, పుదుచ్ఛేరిపై ఈ గాలుల ప్రభావం ఉండనుంది.
30న తీరం దాటే అవకాశం
ఫొని తుఫాను ఈ నెల 30న తీరందాటే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తుఫాను కారణంగా సముద్రం ఆటుపోట్లకు గురయ్యే అవకాశమున్నందున మత్స్యకారులెవరూ సముద్రంలోకి వెళ్లొద్దన్ని సూచించింది. విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ఫొని తుఫాను నేపథ్యంలో ఏపీ విపత్తు నిర్వాహణ శాఖ అన్ని శాఖలను అప్రమత్తం చేసింది.