జైలు నుండి ఖైదీలు ఎస్కేప్: నాలుగు గంటల్లో మళ్లీ కటకటాల వెనక్కి
బెంగళూరు: జైలు నుండి తప్పించుకున్న ఖైదీలను పోలీసులు వెంటాడి అరెస్టు చేశారు. తప్పించుకున్న ఖైదీలు నాలుగు గంటలలోనే పోలీసులకు చిక్కిపోయి మళ్లి కటకటాల వెనక్కి వెళ్లారు. బెంగళూరు పారిపోవడానికి ప్రయత్నించిన నిందితులు నాకాబందీలో పోలీసులకు పట్టుబడ్డారు.
కర్ణాటకలోని కులబర్గి జిల్లా సెంట్రల్ జైలులో ఉన్నమహమ్మద్ సాధిక్, రఫిక్ అనే ఇద్దరు ఖైదీలను బుధవారం రాత్రి 7 గంటల సమయంలో పోలీసుల కళ్లుగప్పి పరారైనారు. తరువాత విషయం గుర్తించిన జైలు సిబ్బంది పై అధికారులకు సమాచారం అందించారు.
ఫరహతాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు ఖైదీల కోసం గాలించారు. జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో నాకాబంధి ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితిలో నిందితులు తప్పించుకోకుండా జాగ్రతలు తీసుకున్నారు.
బుధవారం రాత్రి 11.15 గంటల సమయంలో కులబర్గి జిల్లా జీవర్గి సమీపంలో నాకాబంధిలో ఉన్న పోలీసులు లారీలలో సోదాలు చేశారు. ఆ సమయంలో బెంగళూరు వెళుతున్న లారీలో మహమ్మద్ సాధిక్, రఫిక్ ఇద్దరు ఉన్న విషయం గుర్తించి అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.
మహమ్మద్ సాధిక్ కు 5 సంవత్సరాల జైలు శిక్షపడింది. హత్య కేసులో రఫిక్ యావజ్జీవకారాగార శిక్షకు గురైనాడు. వీరిద్దరు బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇటివల ఇద్దరిని కులబర్గి జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు.