అగ్రి బిల్లులు : కనీస మద్దతు ధర.. వ్యవసాయ మార్కెట్లపై ప్రధాని మోదీ క్లారిటీ...
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు 21వ శతాబ్దపు భారతదేశ అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఈ బిల్లులు చారిత్రాత్మకమని... రైతుల ఆర్థిక స్థితి గతులను మార్చివేస్తాయని చెప్పారు. తాజా బిల్లులతో రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా... ఏ ధరకైనా అమ్ముకునే వెసులుబాటు కలిగిందన్నారు. ఉభయ సభల్లో వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం(సెప్టెంబర్ 21) ఆన్లైన్ ద్వారా వీటిపై మాట్లాడారు.
'పార్లమెంటులో నిన్న రెండు వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందాయి. ఈ సందర్భంగా రైతులకు అభినందనలు తెలియజేస్తున్నాను. వ్యవసాయ రంగంలో ఈ మార్పు ఇప్పటి తక్షణ అవసరం... అందుకే ఈ ప్రభుత్వం కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది. ఇప్పుడు రైతులు తమ ఉత్పత్తులను తమకు నచ్చిన ధరకు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. రైతుల ఆర్థిక స్థితి గతులను మార్చేందుకు ఈ బిల్లులు ఉపయోగపడుతాయి' అని మోదీ పేర్కొన్నారు.
అమలులోకి వస్తే ఇప్పుడున్న మండీలు(వ్యవసాయ మార్కెట్లు) లేకుండా పోతాయని కొంతమంది రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ మండీలు అలాగే కొనసాగుతాయని చెప్పారు. వ్యవసాయ మార్కెట్లకు కొత్త బిల్లులు వ్యతిరేకం కాదన్నారు. అలాగే రైతులకు కనీస మద్దతు ధర ఉంటుందని... ప్రభుత్వం చేసే కొనుగోళ్లు కూడా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
కాగా,లోక్సభలో సునాయాసంగా గట్టెక్కిన వ్యవసాయ బిల్లులకు రాజ్యసభలో విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఆదివారం(సెప్టెంబర్ 20) విపక్ష సభ్యుల ఆందోళన,గందరగోళం నడుమనే మూజువాణి ఓటు ద్వారా బిల్లు సభా ఆమోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ ప్రకటించారు. అయితే డిప్యూటీ చైర్మన్ సభా నియామాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ 12 పార్టీలకు చెందిన దాదాపు 100 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చాయి. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆ నోటీసులను తిరస్కరించారు.