మైక్ విరగొట్టి.. ప్రతులు చించేసి - ప్రతిపక్షాల నిరసనల మధ్యే రాజ్యసభలో వ్యవసాయ బిల్లులకు ఆమోదం
వ్యవసాయ బిల్లులపై చర్చ సందర్బంగా ఆదివారం రాజ్యసభలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులు.. రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) బిల్లు, రైతుల (సాధికారత, పరిరక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లు, నిత్యావసర సరుకుల (సవరణ) బిల్లుల్ని రైతుల పాలిట డెత్ వారెంట్ గా కాంగ్రెస్ అభివర్ణించింది. విపక్షంలో రెండో అతిపెద్దపార్టీ తృణమూల్ కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసి సభాపతి పోడియంలోకి దూసుకెళ్లింది..
Recommended Video
రాజ్యసభ: విజయసాయిరెడ్డి సంచలనం - 'దళారీ కాంగ్రెస్' వ్యాఖ్యలపై రగడ - మోదీ వెంటే జగన్
ఈ వివరణ సరిపోదంటూ..
వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. కనీస మద్దతు ధరకు గ్యారెంటీ ఇవ్వాలని, కనీసం బిల్లుల్ని సెలెక్ట్ కమిటీ పరిశీలనకైనా పంపాలని విపక్షఎంపీలు కోరగా, ఎంఎస్పీకి ఢోకా ఉండదని ప్రభుత్వం సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. కనీస మద్దతు ధరపై ఈ మాత్రం విరణ సరిపోదని, బిల్లులో సవరణ లేదా సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపడం అనివార్యమని విపక్ష ఎంపీలు వాదించారు. ఈలోపే బిల్లులపై మూజువాణి ఓటు చేపట్టేందుకు సభాపతి ప్రయత్నిచగా, విపక్షం భగ్గున మండింది. టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ సహా కాంగ్రెస్ ఎంపీలు పోడియంలోకి దూసుకెళ్లారు..
సభాపతి ముఖంమీదే చిపేసి..
డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ సభాపతి స్థానంలో కూర్చొని ఉండగా.. పోడియంలోకి వెళ్లిన టీఎంసీ ఎంపీ.. అక్కడున్న రూల్స్ బుక్ ను, బిల్లు ప్రతిని లాక్కొని చించేశారు.. సభాపతి ఎదురుగా ఉన్న మైక్ ను విరగొట్టే ప్రయత్నం చేశారు. ఒబ్రెయిన్ కు తోడుగా కాంగ్రెస్ ఎంపీలు సైతం పోడియంలోకి వెళ్లి వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో డిప్యూటీ చైర్మన్ సభను కొద్ది నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన వెంటనే ఓటింగ్ చేపట్టిన డిప్యూటీ చైర్మన్.. బిల్లులు ఆమోదం పొందాయని ప్రకటించి, సభను సోమవారానికి వాయిదా వేశారు.
కార్పొరేట్లకు బానిసలుగా రైతులు - వ్యవసాయ బిల్లులపై రాహుల్ గాంధీ - రాజ్యసభలో రచ్చ
గట్టెక్కిన మోదీ సర్కార్..
ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్యే రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందడంతో, డివిజన్ పద్ధతిలో కాకుండా, మూజువాణి ఓటు ద్వారా బిల్లులు ఆమోదం పొందినట్లు డిప్యూటీ చైర్మన్ ప్రకటించడంతో మోదీ సర్కారు గట్టెక్కినట్లయింది. వ్యవసాయ రంగానికి సంబంధించి మూడు బిల్లుల్లో.. నిత్యావసర సరుకుల (సవరణ) బిల్లు ఇదివరకే పాస్ కాగా, ఆదివారం వ్యవసాయ రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) బిల్లు, రైతుల (సాధికారత, పరిరక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లులకు ఆమోదం లభించింది.