షాకింగ్: చికెన్ బిర్యానీతో బర్డ్ ఫ్లూ -రైతుల ద్వారా వైరస్ వ్యాప్తి -రంగంలోకి కేంద్రం: బీజేపీ ఎమ్మెల్యే
సెలవురోజైన ఆదివారం ఇంట్లోనో, రెస్టారెంట్లలోనే సరదాగా చికెన్ బిర్యానీ తినేందుకు ప్లాన్ చేసుకున్నారా? అయితే, ముందుగా ఈ వార్తను డైజెస్ట్ చేసుకోవాల్సిందే. దేశంలో బర్డ్ ఫ్లూ కేసులు నానాటికీ పెరుగుతోన్న క్రమంలో.. అది విస్తరించడానికి కారణం బిర్యానీనే అని, కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తోన్న రైతుల వల్లే బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతోందని సెలవిచ్చారు ఘనత వహించిన బీజేపీ కీలక నేత. ఓవైపు కరోనా, ఆపై బర్డ్ ఫ్లూ, భయానక చలిలోనూ రైతుల నిరసనలు.. ఈ అన్ని అంశాలను కలిపేస్తూ సదరు నేత చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి..
రైతుల ముసుగులో టెర్రరిస్టులు..
వ్యవసాయ రంగంలో సంస్కరణ పేరుతో కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ వేదికగా రైతులు చేస్తోన్న నిరసనలు ఆదివారంతో 46వ రోజుకు చేరాయి. చట్టాలను రద్దు చేసుకుని, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలన్న రైతుల డిమాండ్ కు కేంద్రం అంగీకరించడంలేదు. సమస్యల పరిష్కారం దిశగా ఇప్పటికే 8రౌండ్ల చర్చలు జరగ్గా, అవన్నీ విఫలమయ్యాయి.
ఈనెల 15న రైతులతో కేంద్రం మరోసారి చర్చించనుంది. రైతుల ఆందోళనకు మద్దతుగా ఈ నెల 15న దేశవ్యాప్తంగా అన్ని రాజ్ భవన్ ల ఎదుట నిరసనలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ నెల 26న చేపట్టే కిసాన్ రిపబ్లిక్ పరేడ్కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భారత్ లో పోరాడుతున్న రైతులకు మద్దతుగా వంద మందికిపైగా బ్రిటన్ లేబర్ ఎంపీలు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్కు లేఖ రాయడం అంతర్జాతీయంగానూ చర్చనీయాంశమైంది. కాగా, ఢిల్లీ సరిహద్దుల్లోని నిరసనల్లో రైతుల ముసుగులో టెర్రరిస్టులు, రౌడీలు, గుండాలు బైఠాయించారని బీజేపీ నేత మదన్ దిలావర్ వ్యాఖ్యానించారు.
బిర్యానీతో బర్డ్ ఫ్లూ వ్యాప్తి..
కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రాజస్థాన్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రైతులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనకు దిగిన రైతులు అక్కడే చికెన్ బిర్యానీలు తింటూ, దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాపింపజేస్తున్నారని ఆరోపించారు. దొంగలు, ఉగ్రవాదుల్లా రైతులు ప్రవర్తిస్తున్నారన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన మదన్ దిలావర్.. రాజస్థాన్ లోని రామ్ గంజ్ మండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాగా,
రంగంలోకి కేంద్రం..
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న రైతులు.. చికెన్ బిర్యానీ తినడం వల్లే దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తోందన్న బీజేపీ ఎమ్మెల్యే దిలావర్ అంతటితో ఆగకుండా... ''రైతులు దేశం గురించి ఆందోళన చెందడం లేదు. నిరసనల పేరుతో మంచి రుచికరమైన వంటకాలు తింటూ, పిక్నిక్ మాదిగా టైమ్ పాస్ చేస్తున్నారు. ధర్నాలో పాల్గొంటున్న రైతులు చికెన్ బిర్యానీతో పాటు కాజూ, బాదాములను తింటూ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ విధంగా రైతులు దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాపింపజేస్తున్నారు. రైతుల ముసుగులో ఉన్న టెర్రరిస్టులు, గుండాలు.. నిజమైన రైతులకు శత్రువులుగా మారుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగాలి. నిరసనకారులపై చర్యలకు ఉపక్రమించాలి.. ఆందోళనలను చేస్తోన్న ప్రదేశాల నుంచి రైతులను వెంటనే ఖాళీ చేయించాలి. లేకపోతే వాళ్ల ద్వారా వ్యాపించే బర్డ్ ప్లూ దేశానికి అతి పెద్ద సమస్యగా మారే అవకాశముంది'' అని దిలావర్ అన్నారు.
విస్తరించిన బర్డ్ ఫ్లూ.. కోళ్లపై నిషేధం
బర్డ్ఫ్లూ (ఏవియన్ ఇన్ఫ్లుయెంజా) బాధిత రాష్ట్రాల్లో ఉత్తర్ప్రదేశ్ కూడా చేరడంతో.. దేశంలో ఈ వ్యాధి వణికిస్తున్న రాష్ట్రాల అంకె ఏడుకు చేరింది. ఢిల్లీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల్లో కేసుల పరిస్థితి ఇంకా తేలాల్సి ఉంది. శనివారం ఒక్కరోజు దేశవ్యాప్తంగా 1,200 పక్షులు చనిపోయాయి. కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, హరియాణా, గుజరాత్ రాష్ట్రాలు ఇప్పటికే బర్డ్ఫ్లూ జాబితాలో చేరిన విషయం తెలిసిందే. ఈ వ్యాధి మరింత విస్తరించకుండా తగు నివారణ చర్యలు చేపట్టాల్సిందిగా పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. దేశంలో బర్డ్ఫ్లూ ప్రబలుతున్న నేపథ్యంలో ఢిల్లీలో కోళ్లు, పక్షుల దిగుమతిపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు.