రైతులతో కేంద్రం చర్చలు: 8వ రౌండ్ కూడా ఫెయిల్ -ఎవ్వరూ తగ్గట్లేదు -15న మళ్లీ భేటీ
కొత్త వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేసుకోవాలంటూ రైతు సంఘాల నేతలు ఎలుగెత్తగా.. ఆ ఒక్కటీ తప్ప మిడతా డిమాండ్లను పరిశీలిస్తామంటూ కేంద్రం పట్టుపట్టింది. దీంతో రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న చర్చలు మరోసారి అసంపూర్తిగానే ముగిశాయి. ఢిల్లీలోని విజ్ఞన్ భవన్ వేదికగా జరిగిన 8వ రౌండ్ చర్చల్లో కూడా ఎటూ తేలలేదు..
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుబట్టగా.. చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఇరుపక్షాలు పట్టు వీడకపోవడంతో చర్చలు కొలిక్కి రాకుండానే వాయిదా పడ్డాయి. జనవరి 15న మరోసారి భేటీ కావాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి. కేంద్రం తీరును గర్హిస్తోన్న రైతు సంఘాలు జనవరి 11న సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నాయి.
సవరించిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ 41 రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లో చేస్తోన్న నిరసనలు శుక్రవారంతో 45వ రోజుకు చేరాయి. కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పీయూష్ గోయల్, సోమ్ ప్రకాశ్ శుక్రవారం మధ్యాహ్నం.. రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. అయితే డిమాండ్ల విషయంలో రైతులు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో చర్చలు పరిష్కారం దిశగా పోలేదు.
కొత్త చట్టాలను దేశ ప్రజలందరి కోసం తీసుకొచ్చామని, పంజాబ్ లాంటి ఏ ఒక్క రాష్ట్రానికి పరిమితం కావని కేంద్ర మంత్రుల బృందం రైతు నేతలకు తెలిపింది. చట్టాలను రద్దు చేయడం కుదరదని కూడా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కావాలంటే రైతులు సుప్రీంకోర్టు వెళ్లొచ్చని కూడా ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. ఇందుకు..
ప్రభుత్వ వాదనను తప్పుపట్టిన రైతులు సంఘాల నాయకులు.. కేంద్ర మంత్రుల సూచనలపై మండిపడ్డారని సమాచారం. సుప్రీం ప్రక్రియకు చాలా సమయం పడుతుందన్న రైతు ప్రతినిధులు.. చట్టాలను రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టారు. 'చట్టాలను వెనక్కి తీసుకుంటేనే మేం ఇళ్లకు వెళ్లిపోతాం' అని రైతులు చెప్పినట్లు తెలుస్తోంది.
ఎనిమిదో రౌండ్ చర్చలు అసంపూర్తిగా ముగిని తర్వాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీడియాతో మాట్లాడారు. రైతు సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదని, చట్టాలు రద్దు చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం చెప్పాలని రైతులను కోరామని, దేశంలో చాలా మంది చట్టాలను సమర్థిస్తున్నారని, రైతులతో మరోసారి ఈ నెల 15న చర్చలు జరుపుతామని మంత్రి తెలిపారు. మరోవైపు..