సుప్రీం కోర్టు కమిటీ వద్దకు వెళ్లం.. కేంద్రంతోనే చర్చలు జరుపుతాం: రైతు సంఘాల స్పష్టీకరణ
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ కొత్తగా సంవరణ చేసిన సాగు చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న దీక్షలు.. 51వ రోజైన శుక్రవారం కూడా కొనసాగాయి. సమస్యల పరిష్కారం దిశగా రైతు సంఘాలతో కేంద్రం జరిపిన తొమ్మిదో రౌండ్ చర్చలు కూడా విఫలమయ్యాయి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ వేదికగా శుక్రవారం జరిగిన చర్చలు ఫెయిలైన తర్వాత కేంద్ర మంత్రులు, రైతు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ కీలక అంశాలు చెప్పారు..
బీజేపీకి పవన్ షాకిస్తారా? సరెండరా? తిరుపతి ఉప ఎన్నికపై 21న కీలక నిర్ణయం -వకీల్ సాబ్ దూకుడు చూస్తే
సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని రైతులు పట్టుబట్టగా.. అందుకు కేంద్రం ససేమిరా అనడంతో ఈసారి కూడా చర్చలు కొలిక్కిరాలేదు. దీంతో ఈ నెల 19న మధ్యాహ్నం 12గంటలకు మరోసారి సమావేశమై చర్చలు జరపాలని నిర్ణయించారు. వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకుని, పంటల కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలంటూ 41 రైతు సంఘాల నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేయగా.. అందుకు మంత్రులు నో చెప్పారు. ఇందుకు రాజకీయ కారణాలను చూపించారు. కాగా..
వ్యవసాయ చట్టాల వ్యవహారంలో తొమ్మిదో సారి చర్చలు కూడా విఫలం అయినప్పటికీ.. తాము కేంద్రంతోనే తేల్చుకుంటాం తప్ప సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ వద్దకు తాము వెళ్లబోమని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయిత్ తెలిపారు. చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము కేంద్రంతోనే చర్చలు జరుపుతామన్నారు. సాగుచట్టాల అమలును తాత్కాలికంగా నిలిపేసిన సుప్రీంకోర్టు.. రెండు పక్షాలతో(రైతులు, కేంద్రంతో) సంప్రదింపుల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే.
మోదీ సాబ్.. మా బాకీ ఇప్పించండి -ఇబ్బందుల్లో ఉన్నాం -కేంద్రానికి హైదరాబాద్ నిజాం మనవడి విజ్ఞప్తి
అగ్రికల్చరల్ ఎకనమిస్ట్ అశోక్ గులాటీ, భారతీయ కిసాన్ యూనియన్-మాన్ అధ్యక్షుడు భూపీందర్ సింగ్ మాన్, షేట్కారీ సంఘటన్ అధ్యక్షుడు అనిల్ ఘన్వత్, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రమోద్ కుమార్ జోషీలను సభ్యులుగా సుప్రీంకోర్టు కమిటీని నియమించగా.. తాను రైతుల పక్షానే ఉంటానంటూ మాన్ ఈ కమిటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు రైతు సంఘాలు సైతం సుప్రీం కమిటీ ముందుకు వెళ్లబోమని తెగేసి చెప్పారు.