రైతులతో చర్చలు మళ్లీ విఫలం... డిసెంబర్ 9న మరో దఫా... కేంద్రమంత్రి నరేంద్ర తోమర్ ఏమన్నారంటే..
కేంద్రానికి-రైతులకు మధ్య శనివారం(డిసెంబర్ 5) జరిగిన ఐదో దఫా చర్చలు కూడా విఫలమయ్యాయి. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటారా లేదా.. అయితే అవునని,లేదంటే లేదని రెండు ముక్కల్లో సమాధానం తేల్చేయాలని రైతు సంఘాలు పట్టుబడ్డాయి. 'ఎస్ ఆర్ నో' అంటూ సమావేశంలో ప్లకార్డులను ప్రదర్శించాయి. ముగ్గురు కేంద్రమంత్రులతో దాదాపు 4గంటలు పాటు జరిగినా చర్చల్లో ఎటువంటి పురోగతి లభించలేదు. కేంద్రంతో చర్చించి మరో కొత్త ప్రతిపాదనతో రైతుల ముందుకొస్తామని సమావేశం అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు.
Recommended Video
ఈరోజు చర్చలపై రైతులు ఏమంటున్నారు...
'కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండును సమావేశం ప్రారంభంలోనే కేంద్ర మంత్రులకు మేము స్పష్టంగా వినిపించాం. చట్ట సవరణలతో సంతృప్తి చెందేది లేదని చెప్పాం. మా స్టాండ్ చాలా క్లియర్గా ఉంది. డిసెంబర్ 9న మరోసారి సమావేశమయ్యేందుకు సమయం కోరారు. అందుకు మేము అంగీకరించాం. ప్రభుత్వం రాష్ట్రాలతో చర్చించి ఒక డ్రాఫ్ట్కి రూపకల్పన చేసి చర్చల రోజు మాకు అందించనుంది.' అని భారతీయ కిసాన్ సంఘానికి చెందిన రాకేష్ అనే రైతు నేత తెలిపారు. నిజానికి నేటి సమావేశం నుంచి మధ్యలోనే బయటకెళ్లిపోతామని రైతులు కేంద్రమంత్రులను హెచ్చరించారు. అర్థం లేని చర్చలతో లాభం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ కేంద్రమంత్రులు వారిని బుజ్జగించడంతో చర్చలకు కూర్చొన్నారు.
కేంద్రమంత్రి నరేంద్ర తోమర్ ఏమన్నారు...
'ఇవాళ రెండు భిన్నమైన సమస్యల గురించి చర్చించాం. న్యాయమైన పరిష్కారం లభించాలని మేము కోరుకుంటున్నాం... కానీ ఈరోజు సమావేశంలో అది సాధ్యపడలేదు.కాబట్టి డిసెంబర్ 9న మరోసారి రైతులతో చర్చలు జరుపుతాం. ప్రభుత్వం అన్ని సమస్యలపై చర్చలు జరుపుతుందని రైతులతో చెప్పాం. కనీస మద్దతు ధర కొనసాగుతుందని కూడా చెప్పాం. కొత్త చట్టాలతో వ్యవసాయ మార్కెట్ యార్డులు(మండీలు)కు వచ్చిన నష్టమేమీ లేదని చెప్పాం. నిజానికి సమస్యల పరిష్కారానికి రైతుల నుంచే ఏవైనా సలహాలు,సూచనలు వస్తే పని మరింత సులువవుతుంది.' అని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.
మోదీ సర్కార్ పట్ల నమ్మకం ఉంచాలని...
ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా చిన్న పిల్లలు,వృద్దులను నిరసన ప్రదేశాల నుంచి ఇళ్లకు పంపించేయాలని కేంద్రమంత్రి రైతులకు విజ్ఞప్తి చేశారు. 'మోదీ ప్రభుత్వం రైతుల పట్ల చాలా చిత్తశుద్దితో ఉంది. భవిష్యత్తులోనూ అలాగే ఉంటుంది. మోదీ అధికారంలోకి వచ్చాకే వ్యవసాయ బడ్జెట్,కనీస మద్దతు ధర పెరిగింది. కాబట్టి రైతులు మోదీ సర్కార్ పట్ల నమ్మకంతో ఉండమని చెప్తున్నాం. వారి సమస్యలన్నింటిని ప్రభుత్వం పరిశీలిస్తుందంటున్నాం.' అని నరేంద్ర తోమర్ తెలిపారు. నరేంద్ర తోమర్తో పాటు మరో ఇద్దరు కేంద్రమంత్రులు పీయూష్ గోయల్,సోమ్ ప్రకాష్ తాజా చర్చల్లో పాల్గొన్నారు.