ఇక రైల్వే ట్రాక్లను దిగ్బంధిస్తాం -కేంద్రానికి రైతు సంఘాల వార్నింగ్ -తోమర్ కామెంట్లపై ఆగ్రహం
వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలు గురువారంతో 15వ రోజుకు చేరాయి. సమస్యల పరిష్కారం కోసం కేంద్రంతో జరగాల్సిన చర్చలు రద్దయిన నేపథ్యంలో రైతుల సంఘాల నేతలు గురువారం కీలక మీటింగ్ నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకునేదాకా తమ ఆందోళనను మరింత ఉధృతం చేయనున్నట్టు రైతు నేతలు ప్రకటించారు.
Recommended Video
గ్రేటర్ దెబ్బ: కాంగ్రెస్లో మరో వికెట్ -అంజన్ కుమార్ యాదవ్ రాజీనామా -బీజేపీలో చేరికపై క్లారిటీ..
దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్స్ బ్లాక్
కేంద్రం గనుక కొత్త అగ్రి చట్టాలను రద్దు చేయని పక్షంలో త్వరలో దేశవ్యాప్తంగా రైలు మార్గాలను దిగ్బంధిస్తామని రైతు సంఘాల ఐక్య వేదిక ‘సంయుక్త్ కిసాన్ మంచ్' ప్రకటించింది. మంచ్ నేత బూటా సింగ్ గురువారం మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టబోయే ‘‘రైల్ రోకో''లో భాగంగా ప్రజలంతా రైల్వే ట్రాక్లను దిగ్బంధిస్తారనీ.. త్వరలోనే దీనికి సంబంధించిన తేదీని వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మేము ముందుగానే అల్టిమేటం ఇచ్చాం. ఈ నెల 10లోగా వ్యవసాయ చట్టాలను రద్దు చేయకుంటే మేము రైల్వే ట్రాక్లను దిగ్బంధిస్తామని చెప్పాం. ఆ మేరకే కార్యచారణ ప్రకటిస్తున్నాం''అని బూటా సింగ్ తెలిపారు.
కేంద్రానికి ఆ అధికారం లేదు..
రైతులకు లబ్ధి కోసమే చట్ట సవరణలు చేశామని, రైతు సంఘాలు చెబుతున్నట్లు అవి పూర్తిగా లోపభుయీష్టంగా లేవని, కొత్త చట్టాల్లో ఎలాంటి లోపాలు లేవని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీడియాకు చెప్పడంపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘‘వ్యాపారుల కోసమే వ్యవసాయ చట్టాలు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ఒకవేళ వ్యవసాయం అనేది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనిది అయితే.. దానికి సంబంధించి చట్టాలు చేసేందుకు వారికి (కేంద్రం) ఎలాంటి అధికారం లేదు. రైతుల నుంచి ఇంత పెద్ద ఎత్తున నిరసన వస్తున్నప్పుడు, ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటే కేంద్రానికి కలిగే నష్టమేంటి? వాటిని వెనక్కి తీసుకునేదాకా మేం ముందుకుపోతాం. ఈ నెల 12న టోల్ గేట్లను అడ్డుకుంటాం. డీసీ కార్యాలయాల వద్ద ధర్నా చేస్తాం. 14న దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తాం. రైల్వే ట్రాక్ ల దిగ్బంధంపై త్వరలోనే తేదీని ప్రకటిస్తాం'' అని భారతీయ కిసాన్ యూనియన్ (ఆర్) నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ అన్నారు.
రైతులకు పైనా నష్టం ఉండదు..
కొత్త చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోవడం జరిగేపని కాదని, కేంద్రం ప్రతిపాదించిన సవరణలపై రైతు నేతలతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ ప్రతిపాదనలను రైతు నేతలు పరిశీలించి, చర్చల తేదీని ఖరారు చేయాలని కోరారు. కొత్త చట్టాల వల్ల ఏపీఎంసీ యాక్ట్, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై ఎలాంటి ప్రభావం ఉండదని, వీటిపై లిఖిత పూర్వకంగా భరోసా ఇస్తామన్నారు. రైతుల పొలాలను పారిశ్రామికవేత్తలు ఆక్రమిస్తారన్న అపోహ సరికాదని తోమర్ అన్నారు. మరో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ.. వ్యవసాయ ఉత్పత్తులను ప్రైవేట్ మార్కెట్లోనే విక్రయించాలంటూ రైతులను బలవంతం చేస్తారన్న భయాందోళనలు వద్దని, ఇది పూర్తిగా తప్పుడు ప్రచారమని, వ్యవసాయ చట్టాల్లో అలాంటి నిబంధన ఏదీ లేదన్నారు.