విద్యుత్ అధికారుల వేధింపులకు రైతు బలి: ప్రధాని మోడీకి ఐదు పేజీల లేఖ
భోపాల్: విద్యుత్ అధికారుల వేధింపులు తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛతర్పూర్ జిల్లాలోనని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఐదు పేజీల నోట్ను ప్రధాని నరేంద్ర మోడీకి రాశాడు. తన మృతదేహాన్ని ప్రభుత్వానికి అప్పగించి, తన శరీరంలోని వివిధ భాగాలను అమ్మేసి తాను కట్టాల్సిన రూ. 88,000 విద్యుత్ బిల్లును చెల్లించాలని కోరాడు.
ఆత్మహత్యకు పాల్పడిన రైతుకు చిన్న పిండి గిర్నీ ఉంది. దాన్ని నడుపుకుంటూనే తన ముగ్గురు కూతుళ్లను, కొడుకును పోషించుకుంటున్నాడు. విద్యుత్ బిల్లు కట్టలేదని విద్యుత్ కంపెనీవారు ఆ పిండి గిర్నీతోపాటు మోటార్ బైక్ను స్వాధీనం చేసుకున్నారని అతని కుటుంబసభ్యులు ఆరోపించారు.
విద్యుత్ పంపిణీ కంపెనీ అధికారుల వేధింపుల వల్లే తన సోదరుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని విద్యుత్ కంపెనీలో ఉద్యోగి అయిన బాధితుడి సోదరుడు తెలిపాడు. పిండి గిర్నీతోపాటు మోటార్ బైక్ను విద్యుత్ కంపెనీవారు సీజ్ చేయడంతో తన సోదరుడు తీవ్ర మనోవేదనకు గురై ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పారు.
ఈ ఏడాది పంట సరిగా పండకపోవడంతో విద్యుత్ బిల్లును తన సోదరుడు చెల్లించలేకపోయాడని తెలిపాడు. ఇంతకుముందు నెలకు రూ. 3000 లేదా 4000 వచ్చేదని.. కానీ, ఈసారి ఏకంగా 88,000 బిల్లు వచ్చిందన్నాడు. విద్యుత్ బిల్లును చెల్లించడానికి ఎలాంటి గడువు ఇవ్వకుండానే ఛతర్పూర్ జిల్లా విద్యుత్ అధికారులు లీగల్ నోటీసు పంపడంతోపాటు పిండిగిర్నీ, బైక్ సీజ్ చేశారని బాధితుడి సోదరుడు తెలిపాడు.
విద్యుత్ బిల్లును చెల్లించడానికి తన సోదరుడు కొంత గడువు కావాలని అధికారులను ప్రాదేయపడినా వినిపించుకోలేదని తెలిపాడు. ఈ క్రమంలో మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైన తన సోదరుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని చెప్పాడు. తన సోదరుడు మరణానికి కారణమైన సదరు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలకు భారీ మొత్తాల్లో బిల్లులు పెండింగ్ లో ఉన్నా.. వారిని అడగని విద్యుత్ అధికారులు.. చిన్న మొత్తాలకే తన లాంటి పేద రైతులను వేధింపులకు గురిచేస్తున్నారని లేఖలో బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేగాక, బహిరంగంగా అవమానాలకు గురిచేస్తున్నారని వాపోయాడు. రైతు ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఛతర్పూర్ కలెక్టర్ శీలేంద్ర సింగ్ ఈ ఘటనపై స్పందించారు. బాధితుడి తండ్రికి పెన్షన్ వస్తుందని, అతడు పీఎం కిసాన్ కళ్యాణ్ యోజన కింద లబ్ధి కూడా పొందుతున్నారని తెలిపారు. బాధితుడి సోదరుడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడని చెప్పారు. బాధితుడి కుటుంబానికి వెంటనే రూ. 25వేలు పరిహారంగా అందజేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రైతు ఆత్మహత్యకు కారణమైనవారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.