394 మంది పోలీసులకు గాయాలు.. కొందరు ఐసీయూలో.. 19 మంది అరెస్ట్: ఢిల్లీ సీపీ
ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీ ఘటనలో గాయపడ్డ పోలీసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న 86 మంది వరకు గాయపడ్డారని ఉన్నతాధికారులు తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంఖ్య 394కి చేరింది. ప్రస్తుతం పరిసర ప్రాంతాల్లో పరిస్థితి అదుపులో ఉంది అని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీ వాత్సవ తెలిపారు. ట్రాక్టర్ ర్యాలీకి సంబంధించి ఈ నెల 2వ తేదీన రైతులు ప్లాన్ చేసుకున్నారని చెప్పారు. కానీ రైతులతో చర్చలు జరిగినా.. ట్రాక్టర్ల ర్యాలీ ఆగలేదని చెప్పారు.
రిపబ్లిక్ డే రోజున ర్యాలీ తీసేందుకు తొలుత అంగీకరించలేదని చెప్పారు. కుంద్లీ మనేసర్ పల్వాల్ ఎక్స్ ప్రెస్ వే వద్ద నిర్వహించేందుకు అనుమతి ఇచ్చామని తెలిపారు. కానీ ఢిల్లీలో నిర్వహిస్తామని తర్వాత చెప్పారని వివరించారు. రైతుల ర్యాలీకి సంబంధించి మూడు విడతల చర్చలు జరిపామని.. సింగూ, టిక్రీ, ఘజిపూర్ మీదుగా వెళ్లేందుకు అనుమతి ఇచ్చామని వెల్లడించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ర్యాలీకి సంబంధించి ఆంక్షలు విధించామని పేర్కొన్నారు. కానీ వారు మార్గదర్శకాలను పాటించలేదని చెప్పారు. ఉదయం 7.30 గంటలకు సింగు సరిహద్దు నుంచి మార్చి ప్రారంభించాల్సి ఉందన్నారు.
మకార్బా చౌక్ వద్ద సత్నామ్ సింగ్ పన్ను రెచ్చగొట్టే ప్రసంగం చేశారని.. ఒప్పందాన్ని దర్శన్ పాల్ సింగ్ వమ్ము చేశారని ఢిల్లీ సీపీ తెలిపారు. ఘజిపూర్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయల్దేరారని.. కానీ వారికి మధ్యాహ్నం 12 గంటలకు రావాలని చెప్పామని సీపీ వివరించారు. రైతులను రైతు నేతలు రెచ్చగొట్టారని తెలిపారు. ఘజిపూర్ నుంచి వచ్చిన రాకేశ్ టికాట్ బృందం బారికేడ్లను ధ్వంసం చేశారని తెలిపారు. జరిగిన ఘర్షణలో 394 మంది పోలీసులు గాయపడగా.. చాలా మంది ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారని వివరించారు. 30 పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయని.. వారిని నిలువరించేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించామని తెలిపారు. దాడి చేశారని భావిస్తోన్న 19 మందిని అరెస్ట్ చేశామని వివరించారు.
Recommended Video