కేంద్రానికి రైతుల మరో షాక్- ఈసారి రిపబ్లిక్ డే పరేడ్కు దీటుగా ట్రాక్టర్ల పరేడ్కు ప్లాన్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని చుట్టూ నిరసనలు చేస్తున్న రైతు సంఘాలు తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించాయి. కేంద్రం వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలని తాము చేస్తున్న డిమాండ్లపై రాతపూర్వక హామీ కోరుతున్నా కేంద్రం మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రిపబ్లిక్ డే రోజు భారీ ఎత్తున నిరసనకు ప్లాన్ చేశాయి.
ప్రతీ ఏటా రిపబ్లిక్ డే వేడుకల సందర్బంగా ఢిల్లీలో పరేడ్ జరుగుతుంది. ఈ ఏడాది కూడా భారీ ఎత్తున పరేడ్కు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. అదే రోజు దీనికి పోటీగా మరో పరేడ్ నిర్వహణకు రైతు సంఘాలు నిర్ణయించాయి. రిపబ్లిక్ డే పరేడ్ జరిగే సమయంలోనే ఢిల్లీ చుట్టూ భారీ ట్రాక్టర్ల పరేడ్ నిర్వహిస్తామని ఇవాళ రైతుల సంఘాల నేతలు ప్రకటించారు. ఢిల్లీ చుట్టు పక్కల ఉండే రైతులు తమ ట్రాక్టర్లు, ఇతర వాహనాలతో తరలి రావాలని, జనవరి 6న దీనికి రిహార్సల్ కూడా నిర్వహిస్తామని రైతు సంఘాల నేతలు తెలిపారు.
కుండ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్ప్రెస్వేపై ట్రాక్టర్లు, ఇతర వాహనాలతో పరేడ్ నిర్వహించి కేంద్రానికి తమ సత్తా చూపాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. జనవరి 4న కేంద్రంతో చర్చలు, జనవరి 5న సుప్రీంకోర్టు విచారణ తర్వాత కూడా తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ట్రాక్టర్ల పరేడ్ నిర్వహించి తీరుతామని రైతులు వెల్లడించారు. తమ ఉద్యమానికి కౌంటర్గా కేంద్రం చేస్తున్న ప్రచారానికి నిరసనగా దేశవ్యాప్తంగా జనవరి 6 నుంచి 20వ తేదీ వరకూ దేశ్ జాగృతి అభియాన్ నిర్వహించాలని కూడా రైతు సంఘాలు నిర్ణయించాయి.