రైతు సమస్యలు, నిరుద్యోగంపైనే ఫోకస్: ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసిన మహావికాస్ అగాడీ
ముంబై: గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో మహావికాస్ అగాడీ కామన్ మినిమమ్ ప్రోగ్రాంను విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా రైతు సమస్యల పరిష్కారం, నిరుద్యోగం, ఆరోగ్యం, ఇండస్ట్రీ రంగాలపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ పార్టీల మధ్య కామన్ మినిమమ్ ప్రోగ్రాంపై ఏకాభిప్రాయం కుదిరింది. కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో సెక్యులర్ అనే పదంపై కాస్త బేదాభిప్రాయాలు నెలకొన్నప్పటికీ ఆ తర్వాత శివసేన తగ్గింది. సెక్యులర్ పదం చేరిస్తే తన హిందూత్వ ఓటుబ్యాంకుకు ముప్పువాటిల్లే అవకాశాలున్నాయని శివసేన అభిప్రాయపడింది.
సెక్యులర్ పదంపై కుదిరిన ఏకాభిప్రాయం
కాంగ్రెస్ తన రాజకీయ సిద్ధాంతాలపై ఎక్కడా వెనక్కు తగ్గలేదు. కూటమిలోని ఎన్సీపీ, శివసేన పార్టీలను సెక్యులర్ పదంపై కన్విన్స్ చేయడంలో సక్సెస్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ హిందూత్వ పార్టీ అయిన శివసేనతో చేతులు కలపడంతో రెండు పార్టీల మధ్య సెక్యులర్ అంశం అగ్గిరాజుకునేలా చేసింది. కానీ శివసేన కాస్త తగ్గడంతో అంతా సద్దుమణిగింది. ఇక కామన్ మినిమం ప్రోగ్రాంలో భాగంగా రైతు సంక్షేమం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహావికాస్ అగాడీ దృష్టి పెట్టింది.
అకాల వర్షాలతో పంట నష్టం జరిగిన రైతులను యుద్ధప్రాతిపదికన ఆదుకోవాలని సూచించాయి. ఇందుకోసం రైతులకు రుణమాఫీ చేయాలని పొందుపర్చారు. ఇక పంట నష్టంపై బీమాను రివైజ్ చేసి ఇవ్వాలని పొందుపర్చారు. అంతేకాదు కరువు ప్రాంతాల్లో నీటి సౌకర్యం కోసం చర్యలు తీసుకునేలా ప్రోగ్రాంను రూపొందించారు.
నిరుద్యోగం పై దృష్టి..యువతకు ఫెలోషిప్
ఇక రాష్ట్రంలో మరో ప్రధాన సమస్య నిరుద్యోగం. దీనిపై కూడా దృష్టి సారించింది మహావికాస్ అగాడీ ప్రభుత్వం. నిరుద్యోగం సమస్యకు చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకునేలా ఉమ్మడి అజెండాను రూపొందించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. చదువుకుని ఉద్యోగం కోసం వేచిచూస్తున్న యువతకు ఫెలోషిప్ అందివ్వాలని పార్టీలు ముందుకొచ్చాయి. అంతేకాదు ప్రైవేటు ప్రభుత్వ రంగాల్లో స్థానికులకు 80శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా చట్టం చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో మహావికాస్ అగాడీ పెట్టింది.
మహిళల రక్షణ విద్యపై ఫోకస్
ప్రభుత్వ పథకాల సమన్వయ కోసం రెండు ప్యానెల్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపాయి. ఒక ప్యానెల్ రాష్ట్ర క్యాబినెట్తో కోఆర్డినేట్ కానుండగా మరొక ప్యానెల్ భాగస్వాముల పార్టీలను కోఆర్డినేట్ చేసుకుంటుంది. ఇక మహిళల రక్షణ కోసం వారి విద్యపై కూడా ప్రధాన దృష్టి సారించింది. మహిళలకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటూనే ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల నుంచి వచ్చే అమ్మాయిలకు విద్యావసతులు కల్పించేలా కామన్ మినిమం ప్రోగ్రాంలో రూపొందించారు. అంతేకాదు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ప్రోత్సహించడం, అంగన్వాడీ, ఆశా వర్కర్లకు గౌరవ వేతనం పెంచడం వంటివి ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపర్చారు.
ఇండస్ట్రీ సెక్టార్లో సంస్కరణలు
ఇక పట్టాణాభివృద్ధి కింద రహదారుల మరమత్తులు, స్లమ్లలో నివసించేవారికి పునరావాసం కల్పించడం వంటివి చేర్చారు. ఇక ప్రజల ఆరోగ్యం కోసం ఒక్క రూపాయికే చికిత్సను అందించేందుకు మూడు పార్టీలు ఓకే చెప్పాయి. ఇక కొత్త పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషి చేయడం, పెట్టుబడిదారులను ప్రోత్సహించడం వంటి సంస్కరణలు పారిశ్రామిక అభివృద్ధి కింద చేర్చారు. ఐటీ సెక్టార్లో కొత్తగా పెట్టుబడులు తీసుకొచ్చేలా కృషి చేయాలనే అంశాన్ని సైతం చేర్చారు.
పేదలకు కూడు గూడు బట్ట
సామాజిక న్యాయం గురించి కూడా కామన్ మినిమం ప్రోగ్రాంలో ప్రస్తావించారు. బడుగు బలహీన వర్గాల వారికోసం భారత రాజ్యాంగంలో పొందుపర్చిన అంశాలను అమలు చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా వారికి కావాల్సిన కూడు, బట్ట, నీడ, విద్య, ఆరోగ్యం, ఉద్యోగం వంటివాటిపై ఫోకస్ చేయాలని డిసైడ్ అయ్యాయి. ఇక పర్యాటక రంగంపై దృష్టి సారించి దాని అభివృద్ధికి కృషి చేయాలని నిర్ణయించాయి. ఇక సీనియర్ సిటిజెన్ల కోసం ప్రత్యేక కార్యాచరణ, సామాన్యులకు అందుబాటు ధరలో ఆహారం వంటివి ప్రధాన అంశాలుగా కామన్ మినిమం ప్రోగ్రాంలో మహా వికాస్ అగాడీ చేర్చింది.