రైతులు నేరస్థులు, ఉగ్రవాదులు కాదు ... ఢిల్లీ పోలీసుల తాత్కాలిక జైళ్ళ అభ్యర్ధనపై ఆప్ ఎమ్మెల్యేలు ఫైర్
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులు నేరస్తులు, ఉగ్రవాదులు కాదని వారికోసం తాత్కాలిక జైళ్ళను ఏర్పాటు చేయాలని ఢిల్లీ పోలీసుల అభ్యర్థులపై అధికార పార్టీ అయిన ఆప్ నేతలు మండిపడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన కొనసాగుతున్న దృష్ట్యా , రైతులు ఢిల్లీకి లాంగ్ మార్చి నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఢిల్లీ పోలీసులు తాత్కాలిక జైళ్ళు ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో ఉన్న తొమ్మిది స్టేడియంలను తాత్కాలిక జైళ్ళుగా మార్చడానికి అనుమతి ఇవ్వాలని అధికార ఆప్ ప్రభుత్వాన్ని కోరారు.
శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం ఇచ్చింది .. ఎమ్మెల్యే రాఘవ్ చాధా ట్వీట్
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఢిల్లీ పోలీసుల విజ్ఞప్తిని తిరస్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
తాత్కాలిక జైళ్ళ ఏర్పాటుకు అనుమతి నిరాకరించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు. మన దేశంలో రైతులు నేరస్తులు, ఉగ్రవాదులు కాదని, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఆర్టికల్ 19 (1) ప్రకారం భారత రాజ్యాంగంలో పొందుపరచబడినది అని , నిరసన తెలియజేయడం ఈ సమాజానికి ముఖ్య లక్షణం అని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాఘవ్ చాధా ట్వీట్ చేశారు.
ఈ అభ్యర్ధన అమానవీయ చర్య : ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ట్వీట్
ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ పోలీసులు తాత్కాలిక జైళ్ళు గా స్టేడియాలలో అనుమతి కావాలని కోరడం అత్యంత అమానవీయమైన చర్య అని తన అభిప్రాయం గా పేర్కొన్నారు. రైతుల విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడం తప్పన్నారు. ఢిల్లీ పోలీసులు ఈ తరహా చర్యలకు అనుమతి అడగడం మానేయాలని, మనసున్న పోలీసులు చేసే పని అదే అని సౌరభ్ భరద్వాజ్ ట్వీట్ చేశారు.
నిన్న రైతుల ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా రైతులకు మద్దతు ఇచ్చారు.
వ్యవసాయ చట్టాలపై రైతులకు మద్దతుగా మాట్లాడిన సీఎం కేజ్రీవాల్
మూడు వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేక చట్టాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. రైతులను శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే వారిపై భాష్ప వాయువు ను, వాటర్ క్యానన్లను ఉపయోగించడాన్ని ఆయన తప్పు పట్టారు. రైతులు ఎంతగా వ్యతిరేకిస్తున్నా చట్టాలను ఉపసంహరించుకోవడం లేదని, ఇది పూర్తిగా తప్పు అన్నారు కేజ్రీవాల్. శాంతియుతంగా నిరసన తెలపటం రాజ్యాంగ హక్కు అంటూ ఆయన పేర్కొన్నారు.
పోలీసుల విజ్ఞప్తికి కేజ్రీవాల్ నో
సెప్టెంబరులో కేంద్రం చేసిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి జాతీయ రాజధానికి లాంగ్ మార్చ్ నిర్వహించడానికి నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు బయలుదేరిన క్రమంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో రైతుల ఆందోళనలు కంట్రోల్ చేయడం కోసం తాత్కాలిక జై ళ్ళ అనుమతి కోసం పోలీసులు సీఎం కేజ్రీవాల్ ను అభ్యర్థించారు. ఇక ఈ నేపథ్యంలో అనుమతి ఇవ్వద్దు అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు కేజ్రివాల్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల నిరసనలపై సానుకూలంగా ఉన్న, తమ మద్దతు తెలుపుతున్న ఢిల్లీ ప్రభుత్వం తాత్కాలిక జైళ్ళ ఏర్పాటుపై పోలీసులు విజ్ఞప్తికి అనుగుణంగా సానుకూల నిర్ణయం తీసుకుంది .