రైతు నేతలను కాల్చి చంపేదుకు కుట్ర: ఓ వ్యక్తిని పట్టుకున్న రైతులు
న్యూఢిల్లీ: కేంద్రం, రైతుల మధ్య జరిగిన చర్చలు తాజాగా మరోసారి విఫలం కావడంతో ఆందోలన చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు అనేక కుట్రలు జరుగుతున్నాయని ఓ రైతు సంఘం నేత కుల్వంత్ సింగ్ సంధు అన్నారు. ఈ క్రమంలోనే నలుగురు రైతు నేతలను హత్య చేయాలనుకున్న ఒక వ్యక్తిని మీడియా ముందు ప్రవేశపెట్టారు.
#WATCH | Delhi: Farmers at Singhu border present a person who alleges a plot to shoot four farmer leaders and cause disruption; says there were plans to cause disruption during farmers' tractor march on Jan 26. pic.twitter.com/FJzikKw2Va
— ANI (@ANI) January 22, 2021
రైతుల ఆందోళనను, రిపబ్లిక్ డే రోజున చేపట్టనున్న ట్రాక్టర్ల నిరసనను భగ్నం చేసేందుకు ఓ వ్యక్తి.. నలుగురు రైతు సంఘం నేతలను చంపేందుకు కుట్ర పన్నాడని తెలిపారు. రైతు సంఘం నేతలను కాల్చి చంపేందుకు అంతకుముందే రెక్కీ కూడా నిర్వహించినట్లు తెలిసింది. అతడ్ని పట్టుకున్న రైతులు.. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.
రైతు సంఘం నేతలతో చర్చలు మరోసార విఫలం
నూతన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. శుక్రవారం కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్.. రైతు సంఘాల ప్రతినిధులతో జరిపిన 11వ విడత చర్చల్లోనూ ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో తదుపరి చర్చలకు సంబంధించి తేదీ ఖరారు చేయకుండానే చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.
ఈ సమావేశంలో రైతు సంఘాల ప్రతినిధుల వ్యవహారశైలిపై కేంద్రమంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టంలో లోపం లేకపోయిన ప్రతిపాదనలు చేశామన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్. 18 నెలలపాటు ఈ చట్టాలను ప్రతిష్టంబింపజేసే ప్రతిపాదన మించింది ఏదీ తమ వద్ద లేదని అన్నారు. దీనిపై రైతులు నిర్ణయం తీసుకోలేదన్నారు.
'బంతి మీ కోర్టులోనే ఉంది.. కేంద్ర ప్రతిపాదనలపై మీ నిర్ణయం చెబితే మళ్లీ చర్చించేందుకు సిద్ధం' అని రైతు సంఘాల ప్రతినిధుల వద్ద కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఆ తర్వాత నరేంద్ర సింగ్ తోమర్ మీడియాతో మాట్లాడుతూ.. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నేతలు చర్చలు జరపకపోవడం బాధాకరమని అన్నారు.
గత సమావేశంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను దేశం, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పునర్ పరిశీలించాలని కోరామన్నట్లు తెలిపారు. ఈ మూడు వ్యవసాయ చట్టాల రద్దు మినహా మరే ప్రతిపాదనతోనైనా రావాలని రైతు నేతలను కోరారు. కేంద్రం ఇచ్చిన ఆఫర్ కంటే మెరుగైన ప్రతిపాదనతో వస్తే చర్చించేందుకు సిద్ధమని కేంద్రమంత్రి తేల్చి చెప్పారు.