ముగిసిన చక్కాజామ్:ఢిల్లీ, పూణే, బెంగళూరులలో స్వల్ప ఉద్రిక్తతలు, రైతులకు మద్దతుగా ఆందోళనలు
కేంద్రం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న ఉద్యమంలో భాగంగా అన్నదాతలు చేపట్టిన చక్కా జామ్ చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు మినహాయించి ప్రశాంతంగా ముగిసింది. పలు ప్రధాన నగరాల్లో రైతు ఉద్యమానికి మద్దతు పలుకుతున్న వారు, విపక్ష నేతలు రోడ్లపై బైఠాయించి ఆందోళన చేశారు. బెంగళూరు , పూణే, ఢిల్లీ లో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
మూడు గంటల పాటు కొనసాగిన చక్కాజామ్ ..ఢిల్లీ-హర్యానా సరిహద్దు రోడ్లు బ్లాక్
డబ్భై రెండు రోజులుగా నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని సరిహద్దులలో ఆందోళన సాగిస్తున్న రైతులు నేడు తమ పోరాటంలో భాగంగా మధ్యాహ్నం 12 గంటల నుండి మూడు గంటల వరకు జాతీయ, రాష్ట్ర రోడ్డు మార్గాలను దిగ్బంధించారు. ఢిల్లీ-హర్యానా సరిహద్దు నుండి కుండ్లి నుండి పల్వాల్ వరకు హైవేను రైతులు అడ్డుకున్నారు. అంబులెన్సులు మరియు అవసరమైన సేవలకు మాత్రం ఆటంకం కలిగించలేదు. మరోవైపు పఠాన్ కోట్-జమ్మూ హైవే కూడా బ్లాక్ చేశారు.
15 జిల్లాల్లో 33 చోట్ల రోడ్డు దిగ్బంధనాన్ని నిర్వహించామన్న రైతులు
పంజాబ్-హర్యానా సరిహద్దును సైతం దిగ్బంధించారు . అంతేకాకుండా అనేక అంతర్గత మార్గాలు కూడా రైతులు బ్లాక్ చేశారు. భారతీ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహాన్) ప్రధాన కార్యదర్శి సుఖ్దేవ్ సింగ్ కోక్రికలన్ మాట్లాడుతూ పంజాబ్లోని సంగ్రూర్, బర్నాలా, బతిండాతో సహా 15 జిల్లాల్లో 33 చోట్ల రోడ్డు దిగ్బంధనాన్ని నిర్వహించినట్టు తెలిపారు. శాంతియుత సత్యాగ్రహ మార్గంలో పోరాటం సాధించినప్పుడే ప్రయోజనం ఉంటుందని రైతు సంఘాల నేతలు ఎవరు ఎక్కడా ఆగ్రహావేశాలకు గురికావద్దని పిలుపునిచ్చారు.
బెంగుళూరు , ఢిల్లీ , పూణేలలో స్వల్ప ఉద్రిక్తత
బెంగళూరులోని యలహంక పోలీస్ స్టేషన్ బయట ఆందోళన చేస్తున్న రైతు మద్దతు ధరలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీలోని షాహిదీ పార్క్ వద్ద రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టిన నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత తిరిగి వారిని వదిలేశారు. చక్కా జామ్ దృష్ట్యా ఢిల్లీ , యూపీ సరిహద్దులోని ఘాజీపూర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ల ద్వారా భద్రతను పర్యవేక్షించారు.
వ్యవసాయ చట్టాల రద్దు జరిగితేనే ఇళ్ళకు వెళ్తాం అంటున్న రైతులు
ముందు జాగ్రత్త చర్యగా ఢిల్లీలోని పలు మెట్రో రైల్వే స్టేషన్ లలో కి ఎంట్రన్స్, ఎగ్జిట్ గేట్లను మూసివేసిన మెట్రో రైల్వే కార్పొరేషన్ 3 గంటల తర్వాత తిరిగి గేట్లను తెరిచింది. మొత్తానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రైతులు నిర్వహించిన చక్కా జామ్ సంపూర్ణమైంది. ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేశారు. రైతుల డిమాండ్ పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి మంచిది కాదని హితవు పలికారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన తర్వాతనే ఇళ్లకు వెళ్తామని, అప్పటివరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.