వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే: రైతు సంఘాలు, రేపు అమిత్ షా-అమరీందర్ భేటీ
న్యూఢిల్లీ: కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ దేశ రాజదాని సరిహద్దుల్లో చేపట్టిన ఆందోళనలను మరింత ఉధతం చేయాలని నిర్ణయించారు. వెంటనే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
32 రైతు సంఘాల ప్రతినిధులు సమామైన అనంతరం మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 3లోగా ఈ చట్టాల రద్దుకు నిర్ణయం తీసుకోకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. రేపు కేంద్రంతో రైతు సంఘాల ప్రతినిధుల భేటీ కానున్న నేపథ్యంలో ఈ మేరకు డిమాండ్ చేయడం గమనార్హం.
తమ డిమాండ్లను పరిష్కరించకుంటే దేశ రాజధానిలోని మిగిలిన రోడ్లనూ దిగ్బంధిస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. రైతు సంఘాలన్నీ ఐక్యంగానే ఉన్నాయన్నారు. అయితే, రైతు సంఘాల మధ్య చిచ్చు పెట్టాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. కేంద్రం వ్యవసాయ చట్టాలు రద్దు చేయకపోతే ఉద్యమం మరింత పెరిగి ప్రభుత్వం పడిపోతుందని హెచ్చరించారు.
చట్టాలను రద్దు చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. మంగళవారం రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం మరోసారి భేటీ కానున్నారు.
Recommended Video
మరోవైపు, రైతుల ఆందోళనల నేపథ్యంలో గురువారం ఉదయం 9.30గంటల ప్రాంతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ భేటీ జరగనున్నట్లు సమాచారం. రైతుల ఆందోళనలతోపాటు ఇతర సమస్యలపై వీరు చర్చించనున్నారు. కాగా, వ్యవసాయ చట్టాలను రద్దు చేసేది లేదని ఇప్పటికే అమిత్ షా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రైతులకు మేలు చేసే చట్టాలను రద్దుకు విపక్షాలు డిమాండ్ చేయడంపై ఆయన మండిపడ్డారు. చట్టాలపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ధ్వజమెత్తారు.