అసలు రైతులకు ఏం కావాలో తెలియదు, వ్యవసాయ చట్టాలతో సమస్యేంటి?: హేమామాలిని
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల దేశ రాజధాని సరిహద్దులో భారీ ఎత్తున ఆందోళన చేయడాన్ని బీజేపీ ఎంపీ హేమామాలిని తప్పుబట్టారు. అంతేగాక, రైతులకు మేలు చేసే చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.
అసలు రైతులకు ఏం కావాలో తెలియదు..
అసలు రైతులకు ఏం కావాలో తెలియదని హేమామాలిని అన్నారు. అదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పును కూడా ఆమె స్వాగతించారు. రైతులకు ఎంతో మేలు చేసే చట్టాలను వ్యతిరేకించడం సరికాదన్నారు. అంతేగాక, పంజాబ్ రాష్ట్రంలో మొబైల్ ఫోన్ టవర్ల విధ్వంసాన్ని హేమామాలిని ఖండించారు. గత సెప్టెంబర్ నెలలో పార్లమెంటులో ఆమోదం పొందిన మూడు వ్యవసాయ చట్టాల అమలును తాత్కాలికంగా సుప్రీంకోర్టు నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, వ్యవసాయ చట్టాలపై రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేందుకు నలుగురు సభ్యుల కమిటీని నియమించింది.
సుప్రీంకోర్టు తీర్పు మంచిదేనన్న హేమామాలిని..
వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం మంచి పరిణామమే. ఇది పరిస్థితిని కొంత సద్దుమణిగేలా చేస్తుంది. ప్రభుత్వం ఎన్ని చర్చలు జరిపినా రైతులు మాత్రం అంగీకారానికి రావడం లేదు. రైతులకు ఏం కావాలో వారికి తెలియదు. వ్యవసాయ చట్టాలతో వారికున్న సమస్యేంటో కూడా తెలియదు. ఇదంతా రైతులు, రైతు సంఘాలు ఎవరో కొందరు ప్రోద్బలంతో ఈ నిరసనలు చేపడుతున్నారని హేమామాలిని అన్నారు.
సెల్ టవర్ల విధ్వంసం సరికాదన్న హేమామాలిని..
సెల్యూలర్ టవర్ల విధ్వంసం ఏ మాత్రం అంగీకరించే విషయం కాదని హేమామాలిని అన్నారు. పంజాబ్ రాష్ట్రంలో భారీ విధ్వంసం జరిగిందని చెప్పారు. ప్రభుత్వం ఎన్నిసార్లు చర్చలు పిలిచినప్పటికీ.. రాకుండా విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. వారికి ఓ ఎజెండా అంటూ ఏమీ లేదని అన్నారు. పంజాబ్ ప్రభుత్వం కూడా రైతులు విధ్వంసాలకు పాల్పడవద్దని కోరింది. సెల్ టవర్ల విధ్వంసంతో సిగ్నల్స్ అందక విద్యార్థులు, ఉద్యోగులు, యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
1500 జియో సెల్ టవర్ల విధ్వంసం
పంజాబ్ రాష్ట్రంలో 1500 రిలయన్స్ జియో టెలికామ్ టవర్లను రైతులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. నూతన వ్యవసాయ చట్టాల ద్వారా రిలయన్స్ లబ్ధి పొందుతుందనే ప్రచారాన్ని కొందరు చేస్తుండటంతో రైతులు ఈ విధ్వంసానికి దిగినట్లు తెలుస్తోంది. టవర్ల విధ్వంసాల నేపథ్యంలో రిలయన్స్ స్పందించింది. తమకు రైతుల పంటలను కొనుగోలు చేయాలనే ఆసక్తి లేదని, ఆ చట్టాలతో తమకు ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టం చేసింది. ఈ విధ్వంసాలపై కోర్టులను కూడా ఆశ్రయించింది.