దౌర్జన్యం: బలవంతంగా మూత్రం తాగించి, చెప్పులతో దాడి!
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ జిల్లాలో దారుణం జరిగింది. పంటకోతల సందర్భంగా తమ పొలాల్లో పనిచేసేందుకు రాలేదన్న కారణంతో కొంతమంది అగ్రకులాలకు చెందిన వ్యక్తులు ఓ దళిత వ్యక్తి చేత బలవంతంగా మూత్రం తాగించారు. అజంపూర్ బిసౌలియా అనే గ్రామంలో ఏప్రిల్ 23న జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. సీతారాం వాల్మీకి(43) అనే ఓ రైతు తనకున్న కొద్ది పొలంలో గోధమ సాగు చేశాడు. పంటకోతకు రావడంతో కోత పనుల్లో నిమగ్నమయ్యాడు. అదే సమయంలో గ్రామంలో ఠాకూర్ వర్గానికి చెందిన కొంతమంది తమ పొలంలో కోత పనులకు రావాలని అతన్ని బలవంతం చేశారు. తమ పంటకోతలు అయ్యాకే నీ పంటకోత మొదలుపెట్టాలని చెప్పారు. అందుకు అతను ఒప్పుకోకపోవడంతో దౌర్జన్యానికి దిగారు.
'విజయ్ సింగ్ నన్ను పంటకోతకు రమ్మన్నాడు. ఆ సమయంలో వాతావరణం బాగా లేకపోవడంతో.. తనకు బదులు ఆ పని నన్ను చేయమన్నాడు. అందుకు నేను ఒప్పుకోకపోవడంతో నన్ను కొట్టడం మొదలుపెట్టారు. అంతేకాదు, పదేపదే నా మీసాలను లాగుతూ, బలవంతంగా మూత్రం తాగించారు.' అని బాధితుడు సీతారాం వాపోయాడు.
అక్కడితో ఆగకుండా తన కాళ్లు చేతులు కట్టేసి గ్రామంలోకి లాక్కెళ్లి.. చెప్పులతో తనపై దాడి చేశారని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. సీతారాంపై దాడిని పోలీసులు ధ్రువీకరించారు. ప్రాథమిక విచారణలో దాడి జరిగిన మాట వాస్తవమేనని తేలిందన్నారు. నిందితులు విక్రమ్ సింగ్, సోంపాల్ సింగ్, పింకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
గుర్రంపై ఎక్కినందుకు దళితుడిపై దాడి:
రాజస్థాన్ లోని భిల్వారా గ్రామంలో ఓ దళిత కుటుంబం పెళ్లి ఊరేగింపుపై అగ్రకుల వ్యక్తులు ఆదివారం దాడికి పాల్పడ్డారు. ఒక దళితుడు గుర్రంపై ఎక్కి ఊరేగడమేంటి అన్న ఆగ్రహంతోనే దాడికి పాల్పడినట్టు సమాచారం. నిందితులపై కేసులు నమోదు చేసినట్టు స్థానిక పోలీసులు తెలిపారు.