తల్లిలా ఆదరించిన రాజమాత: తమ కోసం అర్ధరాత్రి పాలు తెచ్చిన ధీర వనిత: ఆమెపై మోడీ ప్రశంసలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం సందర్భంగా రాజమాత విజయరాజే సింధియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాజ కుటుంబానికి చెందిన మహోన్నత మహిళగా అభివర్ణించారు. రాజ కుటుంబానికి చెందినప్పటికీ.. ఓ సామాన్యులతో ఇట్టే కలిసి పోయే మనస్తత్వం ఆమెకు ఉందని పేర్కొన్నారు. రాచరిక పోకడలకు దూరంగా ఉన్నారని మోడీ పేర్కొన్నారు. ఒక తల్లిలా పేదలను ఆదరించారని, సమాజ సేవలో గడిపారని మోడీ చెప్పారు.
శతజయంత్యుత్సవాల సందర్భంగా..
స్టోరీ టెల్లింగ్ కాన్సెప్ట్ సందర్భంగా.. ఆయన తన గత అనుభవాలను చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విజయరాజే సింధియా శత జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయని, వచ్చే నెల 12వ తేదీన ఆమె జయంతితో ఈ ఉత్సవాలు ముగుస్తాయని అన్నారు. శత జయంతి ఉత్సవాలను జరుపుకొంటోన్న వేళ విజయరాజే సింధియాను, ఆమె చేసిన అసమాన త్యాగాలను తప్పనిసరిగా గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని చెప్పారు. కొన్ని సంవత్సరాల పాటు తాను ఆమెతో కలిసి పనిచేశానని అన్నారు.
ఏక్తా యాత్రలో
డాక్టర్ మురళీ మనోహర్ జోషీ సారథ్యంలో తాము కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఏక్తా యాత్రను చేపట్టిన రోజుల్లో తాము మధ్యప్రదేశ్లో బస చేశామని, ఆ సమయంలో విజయరాజే సింధియా.. తమను ఎంతో ఆదరించారని మోడీ గుర్తు చేసుకున్నారు. తాము ఏక్తా యాత్రను చేస్తూ గ్వాలియర్ సమీపంలోని శివ్పురికి చేరుకున్నామని, తాము వచ్చిన విషయం తెలుసుకున్న విజయరాజే సింధియా.. అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటలకు తమను పరామర్శించడానికి వచ్చారని అన్నారు.
అర్ధరాత్రి పాలు తెచ్చారు..
డిసెంబర్ చలిలో ఆమె తమ కోసం వేడి వేడి పాలను తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు. ఈ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఆమె తన చేతులతో పాలు అందించిన గొప్ప వనితగా పేర్కొన్నారు. అలాగే- స్వాతంత్య్ర సమరయోధుడు షహీద్ భగత్ సింగ్ గురించి మోడీ ప్రస్తావించారు. సోమవారం భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయనకు దేశం మొత్తం ఆయనకు నివాళి అర్పించాలని కోరారు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం మొత్తాన్ని భగత్ సింగ్ గడగడలాడించారని చెప్పారు.
హైదరాబాదీ అజయ్ సూచన..
భగత్ సింగ్ టీమ్ వర్క్ను విశ్వసించే వారని అన్నారు. లాలా లజపత్ రాయ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్దేవ్, రాజ్గురు వంటి పోరాట యోధులతో కలిసి బ్రిటీషర్లను వణికించారని, భరతమాత దాస్య శృంఖలాలను తెంచడానికి బలిదానం చేశారని గుర్తు చేశారు. దేశ యువత ప్రతి ఒక్కరు భగత్ సింగ్లా మారాల్సిన అవసరం ఉందని, అలాంటి శక్తి సామర్థ్యాలు దేశభక్తిని నేటి తరం ఎలా అవర్చుకుంటుందని హైదరాబాద్కు చెందిన అజయ్ ఎస్ అనే వ్యక్తి నమో యాప్పై కామెంట్ చేశారని మోడీ వివరించారు. భగత్ సింగ్ అడుగుజాడలను నడవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారని చెప్పారు.
మహనీయుల బలిదానాల వల్లే..
అక్టోబర్ 2వ తేదీన జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతిని దేశం మొత్తం జరుపుకొంటుందని అన్నారు. అదేనెల 11ద తేదీన భారత రత్న లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను మోడీ స్మరించుకున్నారు. అలాంటి మహనీయుల త్యాగఫలం వల్ల దేశం దాస్య శృంఖలాల నుంచి విముక్తి పొందిందని, ఆత్మనిర్భర్ భారత్గా ఆవిర్భవించిందని ప్రధాని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మాస్కులను తప్పనిసరిగా ధరించాలని మోడీ మరోసారి సూచించారు.
Recommended Video
రైతుల సంక్షేమం కోసమే..
దేశానికి వెన్నెముకగా భావించే రైతుల సంక్షేమం కోసమే తాము మూడు వ్యవసాయ బిల్లులను ప్రవేశ పెట్టామని ప్రధాని పునరుద్ఘాటించారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా.. రైతాంగంపై ఉన్న ఆంక్షలను ఎత్తేయడానికి అవి ఉపకరిస్తాయని చెప్పారు. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లోనూ వ్యవసాయ రంగం పురోగమించిందని, రికార్డు స్థాయి వ్యవసాయోత్పత్తులు, దిగుమతులు నమోదు అయ్యాయని అన్నారు. ఆత్మనిర్బర్ భారత్లో వ్యవసాయ రంగం, రైతాంగమే కీలకంగా మారారని చెప్పారు.