తమిళనాడుకు నీళ్లు: దుమ్ములేపిన రైతులు
మైసూరు: కబిని రిజర్వాయర్ నుంచి తమిళనాడుకు నీరు విడుదల చెయ్యడంతో కర్ణాటకలోని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోకి చొరబడి అక్కడి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేసిన సంఘటన మైసూరు నగరంలో జరిగింది.
సోమవారం కబిని రిజర్వాయర్ నుంచి అధిక క్యూసెక్కుల నీరు తమిళనాడుకు వదిలిపెట్టారు. విషయం తెలుసుకున్న రైతులు సహనం కొల్పోయారు. మంగళవారం మైసూరు నగరంలోని కమాండ్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటి(కాడా) కార్యాలయం చేరుకున్నారు.
తమిళనాడుకు ఎందుకు నీరు వదిలి పెట్టారంటూ అక్కడ ఉన్న అధికారులతో గొడవకు దిగారు. తరువాత కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. వెంటనే తమిళనాడుకు నీరు వదలడం మానుకోవాలని హెచ్చరిస్తూ నినాదాలు చేశారు.
కార్యాలయం ముందు కూర్చుని నినాదాలు చేస్తు ధర్నా నిర్వహించారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. రైతు సంఘాల నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసు అధికారులతో వాగ్వివాదానికి దిగారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోకుండ తమిళనాడుకు నీరు వదిలి పెడుతున్నదని ఆరోపించారు. ప్రభుత్వ తీరుపై రైతులు విరుచుకుపడ్డారు. కర్ణాటక ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకుంటే పరిస్థితి వేరుగా ఉంటుందని హెచ్చరించారు.
కబిని రిజర్వాయర్ లో 2,284 అడుగుల నీరు నిల్వ చెయ్యడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం కబిని రిజర్వాయర్ లో 2,274 అడుగుల నీరు నిల్వ చేశారు. కేవలం 10 అడుగుల నీరు నిల్వచెయ్యడానికి మాత్రం అవకాశం ఉండటంతో అధికారులు తమిళనాడుకు నీరు వదిలిపెట్టారు. అయితే వర్షాలు పడే సూచనలు లేవని, మీరు ఎలా నీరు విడుదల చేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు.