తికాయత్ పిలుపును అపార్ధం చేసుకున్న రైతులు- సొంత పంటల్నే తగలబెట్టిన వైనం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్న రైతులకు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ నేతృత్వం వహిస్తున్నారు. ఆయన చెప్పినట్టు వింటున్న రైతులు ఇప్పుడు ఆయన ఇచ్చిన ఓ పిలుపును మాత్రం అపార్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
ఈ నెల 18న ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ బీకేయూ నేత రాకేష్ తికాయత్.. ఓ పిలుపు ఇచ్చారు. ఫసల్ జలావో (పంటల్ని తగులబెట్టండి) అంటూ రాకేష్ తికాయత్ ఈ పిలుపునిచ్చారు. కేంద్రం ప్రభుత్వం వ్యవసాయ బిల్లులపై దిగి రాకపోతే ఎంతవరకైనా వెళ్తామని తికాయత్ హెచ్చరించారు. మరో రెండు నెలల్లో చేతికొచ్చే పంటలు కోసేందుకు మనమంతా ఇళ్లకు వెళ్లిపోతామని కేంద్రం అనుకుంటోంది. కానీ మనం ఈ ఓ పంటను కోల్పోవడానికి కూడా సిద్ధం కావాలి, అవసరమైతే ప్రస్తుతం చేతికొచ్చిన పంటల్ని నాశనం చేసి నిరసన తెలపాలని రైతులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
దీంతో రాకేష్ తికాయత్ పిలుపు మేరకు పంజాబ్, హర్యానాలో తమ పొలాలకు వెళ్లిన రైతులు అక్కడ తమ పంటల్ని తగులబెట్టినట్లు తెలుస్తోంది. పలు చోట్ల ఇలా రైతులు తమ పంటల్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ విషయం తెలియగానే రాకేష్ తికాయత్ స్పందించారు. రైతులు ఇప్పుడు పంటల్ని నాశనం చేసుకోవాలని తాను అనలేదని, కేంద్రం మొండిగా వ్యవహరిస్తే అలా చేయాల్సి వస్తుందని మాత్రమే హెచ్చరించినట్లు స్పష్టత ఇచ్చారు. తన వ్యాఖ్యల్ని అపార్ధం చేసుకోవద్దని రైతులను కోరారు.