కర్ణాటక బంద్: బీజేపీకి ఇదే మంచి చాన్స్, రైతుల మద్దతు, కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు చెక్ !
బెంగళూరు: కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం సోమవారంలోపు రైతుల రుణమాఫీ చెయ్యకపోతే కర్ణాటక బంద్ కు పిలుపునిస్తామని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప హెచ్చరించారు. రైతులకు మద్దతుగా తాము కచ్చితంగా పోరాటం చేస్తామని బీఎస్. యడ్యూరప్ప అన్నారు. రైతుల రుణమాఫీ ఆందోళనతో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలకు వారి సొంత నియోజక వర్గాల్లో చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
ఎన్నికల హామీ
2018 మే 12వ తేదీ జరిగిన శాసన సభ ఎన్నికలకు ముందు ప్రచారం చేసిన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తాము అధికారంలోకి వస్తే రైతుల రుణమాఫీ చేస్తామని బహిరంగంగా హామీ ఇచ్చాయి. మూడు పార్టీలు వారివారి ఎన్నికల మేనిఫెస్టోలో రైతుల రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేశారు.
అధికారంలోకి వచ్చారు
ప్రజాతీర్పు బీజేపీ వైపు ఉన్నా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు అడ్డదారిలో అధికారంలోకి వచ్చాయని బీఎస్. యడ్యూరప్ప ఆరోపించారు. అధికారంలో మీరే ఉన్నారని, మీరు ఇచ్చిన రైతుల రుణమాఫీ హామీని వెంటనే అమలు చెయ్యాలని బీఎస్. యడ్యూరప్ప డిమాండ్ చేశారు.
సినిమా స్టోరీలు వద్దు
కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఆయన తండ్రి హెచ్.డి. దేవేగౌడ సినిమా స్టోరీలు చెబుతున్నారని యడ్యూరుప్ప ఆరోపించారు. రైతుల రుణామాఫీ చెయ్యడానికి డబ్బులు ఎక్కడ ఉందని దేవేగౌడ చెప్పడం రైతులను అవమానించినట్లే అని యడ్యూరప్ప మండిపడ్డారు.
మూడు రోజులు టైం
కర్ణాటకలోని రైతుల రుణాలను మూడు రోజులు (సోమవారం)లోపు మాఫీ చెయ్యాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించి కర్ణాటక బంద్ కు పిలుపునిస్తామని బీఎస్. యడ్యూరప్ప హెచ్చరించారు. రైతుల కోసం పోరాటం చెయ్యడానికి ప్రతి బీజేపీ కార్యకర్త సిద్దం కావాలని బీఎస్. యడ్యూరప్ప పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యేలకు చెక్
రైతుల రుణమాఫీ చెయ్యకపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీఎస్-కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సొంత నియోజక వర్గాల నుంచి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునివ్వాలని బీజేపీ నిర్ణయించింది. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చెయ్యాలని రైతులకు బీజేపీ పిలుపునిచ్చింది.