ఢిల్లీకి రైతుల లాంగ్ మార్చ్ హింసాత్మకం- వ్యవసాయ చట్టాలపై ఆక్రోశం
కేంద్రం తీసుకొచ్చిన మూడు కార్పోరేట్ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు మరోసారి రోడ్డెక్కారు. పంజాబ్, హర్యానతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు ఢిల్లీకి లాంగ్ మార్చ్ చేపట్టారు. వీరిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పలుచోట్ల లాంగ్ మార్చ్కు బయలుదేరిన రైతులు పోలీసుల బ్యారికేడ్లను దాటి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లతో వారిని అడ్డుకుంటున్నారు.
పంజాబ్ నుంచి ఢిల్లీకి దాదాపు రెండు లక్షల మంది రైతులు బయలుదేరారు. వీరిని అడ్డుకునేందుకు సరిహద్దుల్లో జాతీయ రహదారిపై హర్యానా పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. వీటిని లెక్కచేయని రైతులు బ్యారికేడ్లు దాటుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. మరికొన్ని చోట్ల వాటర్ క్యానన్లు ప్రయోగించారు. హర్యానా సరిహద్దుల్లోని షంబూ వద్ద పోలీసులు పెట్టిన బ్యారికేడ్లను రైతులు ఘాగర్ నదిలో పడేశారు. దీంతో పరిస్దితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
తాము శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తుంటే పోలీసులు దారుణంగా అడ్డుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ చట్టాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు చెబుతున్నారు. రైతుల లాంగ్ మార్చ్ కారణంగా ఢిల్లీలో మెట్రో రైలు సర్వీసులను మధ్యాహ్నం రెండు గంటల వరకూ నిలిపేశారు. ఆనంద్ విహార్-వైశాలి మార్గంతో పాటు న్యూ అశోక్ నగర్ నుంచి నోయిడా సిటీ మార్గంలోనూ రైళ్లను పూర్తిగా నిలిపేశారు. ఢిల్లీలో ఆందోళనల కోసం రైతులు చేసిన విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరించారు. అయినా రైతులు వెనక్కి తగ్గే పరిస్ధితులు కనిపించడం లేదు.