వీడియో: ట్రాక్టర్లతో జెండాను ఎగుర వేసిన వైనం: ఆ రైతుల జెండా వందనం అద్భుతం!
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవ సంరంభాన్ని పురస్కరించుకుని ఏ భవనం మీద గానీ, లేక స్తంభానికి గానీ మువ్వన్నెల పతాకాన్ని కట్టి ఎగురవేయడాన్ని మనం చూస్తుంటాం. లేదంటే- కార్లు, బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలకు త్రివర్ణ పతకాన్ని కట్టి, ఈ సర్వ సత్తాక దేశంపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటుంటారు ప్రజలు. వాటన్నింటి కంటే భిన్నమైన దృశ్యం ఇది. అనూహ్యమే కాదు.. అద్భుతం అని కూడా అనదగ్గ సన్నివేశం. ఇద్దరు రైతులు తమ ట్రాక్టర్లతో జెండాను ఎగురవేసిన ఆ ఘటన అద్భుతమని కీర్తిస్తున్నారు నెటిజన్లు, ట్విట్టరెటీలు. జైహింద్ అంటూ ఆ ఇద్దరు రైతులను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పంజాబ్ లో చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇద్దరు రైతులు తాము రోజూ వ్యవసాయం చేసే ట్రాక్టర్లను ఎదురెదురుగా తీసుకొచ్చారు. జాతీయ పతాకాన్ని కట్టిన ఓ కర్రను మరో వ్యక్తి ఆ రెండు ట్రాక్టర్ల మధ్య ఉంచాడు. ఆ వెంటనే- ఆ ఇద్దరు రైతులు ట్రాక్టర్ల ముందు భాగాన్ని గాల్లోకి లేపారు. వాటితో పాటు జెండా కూడా గాల్లోకి లేచింది. అనంతరం ఆ రెండు ట్రాక్టర్లను గాల్లోనే చాలాసేపు నిలిపి ఉంచారు.
ఆ రెండింటి మధ్య ఉన్న జెండా రెపరెపలాడుతూ కనిపించింది. ట్రాక్టర్ల చివరన నిల్చుని వారిద్దరూ సెల్యూట్ చేస్తూ కనపించారు. దీన్నంతటినీ మొబైల్ కెమెరాలో చిత్రీకరించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా వైరల్ గా మారింది. రైతుల వినూత్నంగా చేసిన జెండా వందనం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉందని నెటిజన్లు, ట్విట్టరెటీలు వ్యాఖ్యానిస్తున్నారు. వారి సాహసానికి సలాం చేస్తున్నారు.