యూపీ రైతులపై దాష్టీకానికి ప్రతీకారం-పంజాబ్, హర్యాను స్తంభింపజేసిన అన్నదాతలు
యూపీలోని లఖీంపూర్ ఖేరీలో నిరసనలు చేస్తున్న రైతులపైకి బీజేపీకి చెందిన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు, ఆ తర్వాత ఘర్షణలో మరో నలుగురు రైతులు చనిపోయారు. దీనికి నిరసనగా ఇవాళ పంజాబ్, హర్యానాలో రైతులు రైల్ రోకో నిర్వహిస్తున్నారు. దీంతో ఈ రెండు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
లఖీంపూర్ ఖేరీ ఘటనకు బాధ్యుడిగా కేంద్రమంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ హర్యానాలో రైతులు రైళ్లను స్తంభింపజేశారు. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లో రాకపోకలు సాగించే దాదాపు 160 రైళ్లపై ప్రభావం పడింది. లఖీంపూర్ ఘటనకు బాధ్యుడైన అజయ్ మిశ్రాను కేంద్రమంత్రి పదవి నుంచి తప్పించి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కుతున్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లోనూ పలు రైల్వే స్టేషన్లలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
పంజాబ్ లో రైతుల ఆందోళన కారణంగా ఫిరోజ్ పూర్ డివిజన్ లోని నాలుగు సెక్షన్లలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. లఖీంపూర్ ఘటనలో తమకు న్యాయం చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ శాంతియుతంగా రైల్ రోకో నిర్వహిస్తున్నట్లు అన్ని రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. తాము శాంతియుతంగా నిరసనలు జరుపుతున్నా ఇప్పటివరకూ లఖీంపూర్ ఘటనపై కేంద్రం తమతో చర్చలకు ముందుకు రావడం లేదని రైతు నేత రాకేష్ తికాయత్ అన్నారు.
యూపీలో రైల్ రోకోకు ప్రయత్నిస్తున్న రైతులకు లక్నో పోలీసులు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. రైల్ రోకో నిరసనల్లో పాల్గొంటే కఠినమైన జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించి కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. అయినా రైతులు వెనక్కి తగ్గడం లేదు. లఖీంపూర్ ఘటనలో నిందితుడైన అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించి, అరెస్టు చేస్తే తప్ప తమకు న్యాయం జరిగినట్లు కాదని రైతులు చెప్తున్నారు. కానీ ఇప్పటికీ అజయ్ మిశ్రా సైతం తన కుమారుడు ఆశిష్ ఆ రోజు ఘటనలో అక్కడ లేడనే చెప్తున్నారు.