ఢిల్లీలో రైతుల శిబిరానికి రేవంత్ రెడ్డి -ఉద్యమానికి కాంగ్రెస్ ఎంపీ మద్దతు -మార్చిలో తెలంగాణకు టికాయత్
'రాజీవ్ రైతు భరోసా యాత్ర' పేరుతో అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు ఇటీవలే 10 రోజులపాటు పాదయాత్ర నిర్వహించిన కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. మూడు రోజుల కిందటే 'రాజీవ్ రైతు రణభేరి' పేరిట భారీ సభ నిర్వహించి, రైతాంగ, నిరుద్యోగ సమస్యలే ప్రధాన అజెండాగా కాంగ్రెస్ కార్యచరణ ఉంటుందని, మోదీ, కేసీఆర్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళతానని చెప్పిన విధంగానే కీలక చర్యకు ఉపక్రమించారు..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తున్న రైతులకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఘాజీపూర్లోని రైతుల నిరసన శిబిరాల వద్దకు వెళ్లారు. దాదాపు మూడు నెలలుగా అలుపెరుగని పోరాటం చేస్తోన్న రైతులతో ఆయన సంభాషించారు. అంతేకాదు..
ఘాజీపూర్ దీక్షా శిబిరం వద్దే భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ను, ఇతర రైతు సంఘాల నేతలను ఎంపీ రేవంత్ కలుసుకున్నారు. తెలంగాణలో పది రోజుల పాటు తాను చేపట్టిన రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర గురించి రేవంత్.. రైతు సంఘాల నేతలతో మాట్లాడారు. తన పాదయాత్రకు రైతుల నుంచి విశేష ఆదరణ వచ్చిందని వివరించారు.
తెలంగాణలో తాను చేపట్టిన రైతు ఉద్యమానికి మద్దతుగా రాష్ట్రానికి రావాలంటూ రేవంత్.. రైతు సంఘాల నేత రాకేశ్ టికాయత్ ను ఆహ్వానించారు. దీనిపై స్పందించిన టికాయిత్.. మార్చి మొదటి వారంలో తెలంగాణకు వస్తానని చెప్పారు. రైతు సంఘాల నేతలు, రైతులతో చర్చల అనంతరం ఎంపీ రేవంత్ మీడియాతో మాట్లాడారు.
''రాజీవ్ రైతు భరోసాయాత్ర, రైతు రణభేరి కార్యక్రమాల ద్వారా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై ఉద్యమించాం. తెలంగాణలో ఈ ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకు వెళ్లడానికి రాకేశ్ టికాయత్ లాంటి రైతు సంఘాల నేతలను ఆహ్వానించాను. తెలంగాణలో రైతులు, కులవృత్తుల సమస్యలపై ఉద్యమించాల్సిన అవసరాన్ని ఆయనకు వివరించాను. రాజకీయ పార్టీలకు అతీతంగా రైతు సమస్యలపై నిర్వహించబోతున్న కార్యక్రమాలకు జెండాలు, అజెండాలు పక్కన పెట్టి నేతలందరూ కలసిరావాలి'' అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.