ఆర్నెల్లు అయినా సరే ఆ చట్టాలు రద్దు చేసే దాకా ఇక్కడే .. ఛలో ఢిల్లీలో కదం తొక్కిన రైతన్నలు చెప్తుందిదే
ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతల ఆందోళన కొనసాగుతూనే ఉంది. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు ఆందోళనల పర్వం ఆపేది లేదంటూ తేల్చి చెబుతున్నారు రైతు సంఘాల నాయకులు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం లో భాగంగా శనివారం రోజు కూడా ఆందోళన పతాక స్థాయికి చేరుకుంది. చట్టాలను వెనక్కి తీసుకునే వరకు రాజధానిలోనే బైఠాయిస్తామని రైతులు తేల్చి చెబుతున్నారు . ఢిల్లీ కి చేరుకునే అన్ని మార్గాల నుండి ఆందోళనకారులు ఢిల్లీలోనికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.
Recommended Video
బురారిలో నిరంకారీ మైదానంలో శాంతియుత ఆందోళనలకు అనుమతి
బురారిలో నిరంకారీ మైదానంలో శాంతియుతంగా ఆందోళన తెలిపేందుకు పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ , పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు సింఘా లో తమ నిరసనను కొనసాగిస్తూనే ఉన్నారు.
పంజాబ్ నుండి ఢిల్లీ లోకి ప్రవేశించడానికి ఇదే ప్రధాన రహదారి కావడంతో పంజాబీ ఢిల్లీకి వాహన రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. సరిహద్దు చుట్టూ పెద్ద సంఖ్యలో రైతులు మోహరించి ఆందోళన పర్వాన్ని కొనసాగిస్తున్నారు.
తిక్రీ సరిహద్దు తెరిచి ఉన్నా ఢిల్లీలోకి వెళ్ళే అన్ని మార్గాల్లో ఆందోళన
రైతులు దేశ రాజధాని ఢిల్లీ లోకి ప్రవేశించడానికి ఢిల్లీ నుండి బహదూర్ ఘర్ మార్గం ద్వారా తిక్రీ సరిహద్దు వద్ద మార్గాన్ని తెరిచి ఉంచినప్పటికీ, నరేలా సమీపంలోని సింఘా సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అంతేకాకుండా ఢిల్లీ హరిద్వార్ వద్ద కూడా ఉత్తరప్రదేశ్ రైతులు రాజధాని వైపు తరలివస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, రాజస్థాన్, కేరళ, పంజాబ్ ఆరు రాష్ట్రాల రైతులు ఢిల్లీలో ఆందోళన చేయాలని భావిస్తున్న నేపథ్యంలో వారు నగరం నడిబొడ్డున ఉన్న రామ్ లీల మైదాన్ లో ఆందోళన నిర్వహించాలని అనుకుంటున్నారు.
రైతుల నిరసనలతో మూడు ప్రధానరహదారులు బంద్
నిరసనల మధ్య ఢిల్లీకి వెళ్లే మూడు ప్రధాన రహదారులు రైతులు ఆందోళనలతో బ్లాక్ అయినట్లుగా తెలుస్తోంది.
ముళ్లకంచెలు వేసినప్పటికీ, కందకాలు తీసినప్పటికీ, ఎక్కడికక్కడ రైతులను ఢిల్లీ లోకి రాకుండా వారి ప్రవేశాన్ని భారీ బందోబస్తు నడుమ అడ్డుకుంటున్నప్పటికీ రైతులు మాత్రం తమకు కావలసిన ఆహారాన్ని అవసరమైన సామాగ్రిని తీసుకెళ్లే ట్రాక్టర్లతో, వివిధ ప్రాంతాల నుండి ఢిల్లీ లోకి చొరబడి యత్నాలు చేస్తున్నారు. బారికేడ్లను తొలగించి లోనికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
ఆరు నెలలకు సరిపడా రేషన్ తెచ్చుకున్నాం ... తాడో పేడో తేల్చుకునే వెళ్తాం అంటున్న రైతులు
నిరసనకారులు - తమ ఆందోళన సమయంలో ధైర్యంగా టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులు మరియు లాఠీ ఛార్జ్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, తమ నిరసనలను ఆరు నెలల వరకు కొనసాగించడానికి తమకు కావలసినవన్నీ ఉన్నాయని చెప్పారు. ఆరు నెలలకు కావలసిన రేషన్ తో పాటుగా, ఇతర సామాగ్రిని తెచ్చుకున్నామని చెబుతున్న రైతులు, ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించు కుంటేనే తిరిగి వెనక్కి వెళ్తామని తేల్చి చెబుతున్నారు.
బురారీలో నిరంకారీ మైదానంలో రైతుల ఆందోళనకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సీఎం కేజ్రీవాల్
ఢిల్లీలో రైతులకు మద్దతు తెలిపిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బురారీలో జరుగుతున్న ఏర్పాట్లను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ట్వీట్లో తెలిపింది. ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్, ఢిల్లీ జల్ బోర్డు వైస్ చైర్మన్ రాఘవ్ చాధా ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. రైతులకు టెంట్లు వేయడం, ఆహార సదుపాయాలు కల్పించడం చేయాలని స్థానిక ఆప్ ఎమ్మెల్యేలకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలపై రైతుల సాగిస్తున్న పోరాటానికి 500 రైతుల పోరాట సంస్థలు భాగస్వామ్యం తీసుకున్నాయని చెబుతున్నారు . ప్రభుత్వం ఏడు రైతు సంస్థలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా చర్చలు జరపాలని, నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.