వర్షంలోనూ రైతుల ఆందోళన తీవ్రతరం: ఢిల్లీ అష్ట దిగ్బంధం..వర్షంతో ట్రాక్టర్ మార్చ్ రేపటికి వాయిదా
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతల ఆందోళనల పర్వం కొనసాగుతూనే ఉంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకున్నా, ఢిల్లీలో విపరీతంగా ఉన్న చలితో పాటుగా, అకాల వర్షాలు కురుస్తున్నా రైతులు మాత్రం తమ ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఈ రోజు ఢిల్లీలో విపరీతంగా వర్షం కురుస్తున్న కారణంగా తమ ఆందోళనలో భాగంగా నిర్వహించాలనుకున్న ట్రాక్టర్స్ మార్చ్ ను రైతులు వాయిదా వేశారు.
రాబోయే రోజుల్లో ఉద్యమం తీవ్రతరం
రేపు వాతావరణం అనుకూలిస్తే ట్రాక్టర్ మార్చ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం తమ మొండి వైఖరి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రైతులు తేల్చి చెబుతున్నారు. తమ డిమాండ్ల సాధన విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ముక్త కంఠంతో రైతులు నినదిస్తున్నారు. ప్రభుత్వానికి, రైతులకు మధ్య ఇప్పటికి 7 విడతలుగా చర్చలు జరిగినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. ఇప్పటివరకు కేంద్రానికి ,రైతులకు మధ్య జరిగిన చర్చలలో ప్రతిష్టంభన కొనసాగుతోంది.
వర్షం కారణంగా ట్రాక్టర్ మార్చ్ రేపటికి వాయిదా
తాజాగా మరోమారు రైతులతో కేంద్రం చర్చలు జరపడానికి సన్నాహాలు చేస్తుంది. ఇదే సమయంలో రైతులు మాత్రం తమ ఆందోళనను ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు కొనసాగించి తీరుతామని, ఎన్ని నెలలు అయినా సరే తిరిగి వెళ్లేది లేదని తేల్చి చెబుతున్నారు. సింఘూ సరిహద్దులో విలేకరుల సమావేశంలో యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఈరోజు జరగాల్సిన ట్రాక్టర్ మార్చ్ ను వర్షం కారణంగా రేపు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
కుండ్లి-మానేసర్-పాల్వాల్ (కెఎంపి) వరకు ట్రాక్టర్ మార్చ్
రైతులు అన్ని నిరసన ప్రదేశాలనుండి కుండ్లి-మానేసర్-పాల్వాల్ (కెఎంపి) వరకు ట్రాక్టర్ మార్చ్ నిర్వహిస్తారని తెలిపారు.గత మూడు రోజులుగా ఢిల్లీ నగరంలో జోరున వర్షం కురుస్తున్నప్పటికీ, విపరీతమైన చలి గాలులు వీస్తున్నప్పటికీ జోరువానలోనూ రైతులు కొనసాగిస్తున్న ఆందోళన ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. ప్రభుత్వం మాత్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేయకుండా, ప్రత్యామ్నాయం సూచించాలని రైతులను కోరుతోంది.
హర్యానా మరియు ఉత్తర ప్రదేశ్తో జాతీయ రాజధాని సరిహద్దులు బ్లాక్
కొనసాగుతున్న రైతుల ఆందోళన కారణంగా హర్యానా మరియు ఉత్తర ప్రదేశ్తో జాతీయ రాజధాని సరిహద్దులు బుధవారం అనేక పాయింట్ల వద్ద మూసివేయబడ్డాయి. ఢిల్లీ ,ఉత్తర ప్రదేశ్తో చిల్లా మరియు ఖాజిపూర్ వద్ద సరిహద్దులు, నోయిడా మరియు ఘజియాబాద్ నుండి వచ్చేవారికి కూడా రోడ్స్ బ్లాక్ చేయబడ్డాయి. అయితే ఎదురుగా ఉన్న క్యారేజ్వే తెరిచి ఉంది.ఉత్తరప్రదేశ్ నుండి ఢిల్లీ వచ్చేవారికి, ఆనంద్ విహార్, డిఎన్డి, లోని డిఎన్డి మరియు అప్సర సరిహద్దుల గుండా వెళ్లే మార్గాలను తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ట్రాఫిక్ మళ్ళిస్తున్న పోలీసులు
నిరసనకారులు ఈ మార్గాలను కూడా బ్లాక్ చెయ్యకుండా పోలీసులు ఈ సరిహద్దు పాయింట్లను తనిఖీ చేస్తూనే ఉన్నారు. ఢిల్లీ మరియు హర్యానా మధ్య సరిహద్దులలో , సింగు, తిక్రీ, ఆచండి, మన్యారి, సబోలి మరియు మంగేష్ గుండా వెళ్లే మార్గాలు మూసివేయబడ్డాయి. హర్యానా సరిహద్దు తేలికపాటి వాహనాలు మరియు పాదచారులకు తెరిచి ఉంది . ముకర్బా, జిటికె రోడ్ నుంచి ట్రాఫిక్ను మళ్లించామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.