రైతు ఉద్యమంలో మరో మలుపు -ప్రధాని పిలుపుతో చర్చలకు సిద్ధమైన సంఘాలు -మోదీ కామెంట్లపై భగ్గు
వ్యవసాచ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు.. ఆందోళనను విరమించి, చర్చలకు రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై రైతు సంఘాలు స్పందించాయి. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, చర్చల తేదీ, వేదికలను ప్రభుత్వమే ఖరారు చేయాలంటూ సంఘాల నేతలు సోమవారం రాత్రి ఒక ప్రకటన చేశారు. అయితే, రాజ్యసభలో రైతు ఉద్యమంపై మోదీ చేసిన వ్యాఖ్యలను మాత్రం రైతులంతా ముక్తకంఠంతో ఖండించారు..
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ శివారులు రైతులు చేస్తోన్న నిరసనలు సోమవారానికి 75 రోజులు పూర్తయ్యాయి. కొత్త చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకుని, కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించేదాకా వెనక్కి తగ్గబోమని రైతు సంఘాలు భీష్మించగా.. అవసరమైతే ఏడాదిన్నర వాయిదా వేస్తాంగానీ, చట్టాలను మాత్రం వాపస్ తీసుకోబోమని, ఎంఎస్పీ గ్యారెంటీ ఇస్తామని కేంద్రం వాదిస్తోంది. ఈ క్రమంలో రెండు వర్గాలకు మధ్య 11సార్లు చర్చలు జరిగినా ఫలితం రాలేదు. రిపబ్లిక్ డే రోజున ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా హింస తలెత్తిన తర్వాత చర్చల ప్రక్రియ నిలిచిపోయింది. అయితే..
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ సోమవారం రాజ్యసభలో మాట్లాడిన ప్రధాని మోదీ.. రైతులు చర్చలకు రావాల్సిందిగా కోరారు. రెండు వారాలుగా చర్చల ప్రక్రియ నిలిచిపోగా, ఇప్పుడు ప్రభుత్వ అధినేతనే ఆహ్వానం పలికారు. కాగా, చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని, ఈ విషయంలో ప్రభుత్వ ప్రతిపాదనలను ఏనాడూ తిరస్కరించలేదని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. 12 రౌండ్ చర్చల తేదీని, వేదికను ప్రభుత్వమే ఖరారు చేయాలని కోరారు...
దేశంలో కొత్తగా 'ఆందోళన జీవులు' పుట్టుకొచ్చాయంటూ రైతు ఉద్యమంపై ప్రధాని మోదీ చేసిన కామెంట్లను రైతు సంఘాల నేతలు ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసనలకు ప్రాముఖ్యం ఉంటుందని ప్రభుత్వం చేసే తప్పుడు విధానాలను వ్యతరేకించే హక్కు ప్రజలకు ఉందని సంయుక్త కిసాన్ మోర్చా సీనియర్ సభ్యుడు శివ కుమార్ కక్కా అన్నారు.
అదను చూసి దెబ్బకొట్టిన మోదీ -కాంగ్రెస్ పక్ష నేత ఆజాద్ పదవి గల్లంతు -జమ్మూకాశ్మీర్ అనాధ
పంటలకు కనీస మద్దతు ధర ఎప్పుడూ ఉంటుందన్న ప్రధాని హామీపైనా రైతు నేతలు మండిపడ్డారు. ఎంఎస్పీ అన్ని వేళలా ఉంటుందని చెబుతోన్న మోదీ.. దానికి చట్టబద్దత కల్పించడానికి మాత్రం ఎందుకు వెనుకాడుతున్నారని మరో నేత అభిమన్యు కోహర్ ప్రశ్నించారు. రైతు ఉద్యమాన్ని పక్క దారి పట్టించాలన్న ఉద్దేశంతోనే మోదీ అనవసర కామెంట్లు చేస్తున్నారని బీకేయూ ప్రధాన కార్యదర్శి సుఖ్దేవ్ సింగ్ మండిపడ్డారు. ఇక..
ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వ కుట్రలు, ప్రధాని నరేంద్ర మోదీ అనుచిత కామెంట్లను దేశప్రజలంతా గమనిస్తున్నారని, కేంద్రం పన్నాగాలను అమలు చేసేకొద్దీ రైతుల్లో ఐక్యమత్యం పెరుగుతూ వస్తోందని బీకేయూ నేత రాకేశ్ టికాయత్ అన్నారు. ఢిల్లీ శివారుల్లోని దీక్షా స్థలాలకు కొత్తగా రైతుల్ని అనుమతించకపోవడంతో.. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో ఎక్కడికక్కడే కిసాన్(రైతు) పంచాయత్ ను ఏర్పాటవుతూ, ఉద్యమం ఉధృతంగా సాగుతోందని ఆయన చెప్పారు.