కేంద్రంపై రైతుల కన్నెర్ర- కార్పోరేట్ వ్యవసాయంపై ఆగ్రహం- మూడు రాష్ట్రాల్లో రోడ్లపైకి...
దేశంలో వ్యవసాయాన్ని కార్పోరేటీకరణ చేయడం ద్వారా లాభసాటిగా మార్చే పేరుతో కేంద్ర ప్రభుత్వం తాజాగా మూడు ఆర్డినెన్స్లకు ఆమోదం తెలిపింది. వీటిలో నిత్యావసర సరుకులపై ఓ ఆర్డినెన్స్, రైతులకు సాధికారిత కల్పించడంతో పాటు గిట్టుబాటు ధరలు కల్పించే ఉద్దేశంతో మరో ఆర్డినెన్స్, వ్యవసాయ ఉత్పత్తులకు వాణిజ్యపరమైన ప్రోత్సాహం కల్పించే పేరుతో మరో ఆర్డినెన్స్ను ఆమోదించారు. వీటిని త్వరలో ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాల్లో ఆమోదించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.
రైతులకు మేలు చేస్తున్నామనే పేరుతో కార్పోరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా ఉన్న ఈ మూడు ఆర్డినెన్స్లకు చట్టరూపం ఇచ్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై రైతులు మండిపడుతున్నారు. ఉత్తరాదిలోని హర్యానా, పంజాబ్ ల్లో ప్రారంభమైన రైతుల నిరసనలు తాజాగా యూపీలోని పలు ప్రాంతాలకు పాకాయి. కానీ కేంద్రం మాత్రం కాంట్రాక్ట్ వ్యవసాయం ద్వారా రైతులకు తమ ఉత్పత్తులు, గిట్టుబాటు ధరలు, అమ్ముకునే స్వేచ్ఛను కల్పిస్తున్నట్లు చెబుతోంది. వ్యవసాయంలోకి ప్రైవేటు, విదేశీ పెట్టుబడులకు సైతం తలుపులు తెరుచుకుంటాయని నమ్మబలుకుతోంది. కానీ రైతులు దీన్ని నమ్మడం లేదు. దీంతో పలు రాష్ట్రాల్లో నిరసనలు మొదలయ్యాయి.
ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో సాగుతున్న నిరసనలు త్వరలో కర్నాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, బీహార్, మధ్యప్రదేశ్కూ పాకే అవకాశముందని రైతు సంఘాలు చెబుతున్నాయి. అదే విధంగా పార్లమెంటు సమావేశాల ఆరంభం రోజున అంటే సెప్టెంబర్ 14న దేశవ్యాప్త నిరసనలకు రైతులు పిలుపునిచ్చారు. కేంద్రం కార్పోరేట్ ఆర్డినెన్స్లను ఆమోదం కోసం పార్లమెంటులో ప్రవేశపెడితే తీవ్ర పరిణామాలు తప్పవని రైతులు హెచ్చరిస్తున్నారు. కేంద్రం చెబుతున్న కాంట్రాక్ట్ వ్యవసాయ విధానం ఇప్పటికే ప్రయోగాత్మకంగా విఫలం అయిందని వారు గుర్తు చేస్తున్నారు.