ఢిల్లీ సరిహద్దుల్లోనే ట్రాక్టర్ ర్యాలీ -ఎర్రకోట వద్ద కాదు -రిపబ్లిక్ డే పరేడ్కు ఆటంకాలుండవు: రైతులు
వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరిట కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో రైతులు చేస్తోన్న నిరసనలు గురువారంతో 51వ రోజుకు చేరాయి. కేంద్రంతో చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోన్న దరిమిలా రైతులు తమ ఉద్యమ కార్యాచరణను ఉధృతం చేశారు. దేశ గణతంత్ర దినోత్సవవం రోజున భారీ ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించి తీరుతామని రైతు సంఘాలు స్పష్టం చేయగా.. భిన్నవాదనలు వచ్చాయి. దీంతో..
ఈ నెల 26 న గణతంత్ర దినోత్సవం నాడు తాము ఢిల్లీ-హర్యానా బోర్డర్ లోనే ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని, ముందుగా అనుకున్నట్లు ఎర్రకోట వద్ద ర్యాలీ ఉండదని రైతు సంఘాలు గురువారం ప్రకటించాయి. జనవరి 26 దేశ గణతంత్ర దినోత్సవ వేడుకలను అడ్డుకోవాలన్నది తమ అభిమతం కానేకాదని, ఆ రోజున జరిగే పరేడ్, ఇతర కార్యక్రమాలను తాము భంగపరచబోమని భారతీయ కిసాన్ యూనియన్ నాయకులు తెలిపారు. అయితే..
జనవరి 26న రైతులు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ముసుగులో కొన్ని వేర్పాటువాద శక్తులు జాతీయ కార్యక్రమాలకు అడ్డుకోవాలని చూస్తున్నాయని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. అలాంటి వేర్పాటువాద దుష్టశక్తులతో రైతులెవరూ చేయికలపరాదని, విచ్ఛిన్నకర శక్తులకు దూరంగా ఉండాలని రైతులందరికీ యూనియన్ నేతలు బహిరంగ లేఖ రాశారు.
ఎర్రకోట వద్ద కాకుండా, ఢిల్లీ-హర్యానా సరిహద్దులో నిర్వహించబోయే ట్రాక్టర్ల ర్యాలీకే రైతు సంఘాలు భారీగా ప్లాన్ చేశాయి. గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు రైతులంతా తమ ట్రాక్టర్లతో ఢిల్లీ సరిహద్దులకు చేరుకోవాలని ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటీ పిలుపునిచ్చింది. రైతు చట్టాలకు తామంతా వ్యతిరేకమని మళ్ళీ కేంద్రానికి చాటి చెప్పాలని కోరింది.
జనవరి 26న రైతులు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీని అడ్డుకోవాల్సిందిగా కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. సాగు చట్టాల విషయం కేంద్రం వెనక్కి తగ్గితీరాల్సిందేనని, ఒకవేళ మోదీ సర్కారు దిగి రాకుంటే.. 2024 వరకు ఆందోళనను కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.