కేంద్రమంత్రి నరేంద్ర తోమర్కు రైతుల ఝలక్... చర్చల విరామంలో ఊహించని కౌంటర్..
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో చర్చల సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్కు రైతులు ఝలక్ ఇచ్చారు. చర్చల విరామంలో కేంద్రమంత్రి ఆఫర్ చేసిన 'టీ'ని తిరస్కరించారు. అంతేకాదు,ఇక్కడ టీ తాగే బదులు తాము నిరసన తెలియజేస్తున్న ప్రదేశానికి వస్తే టీతో పాటు జిలేబీ,పకోడా ఇస్తామని కౌంటర్ ఇచ్చారు.
పంజాబ్ కిసాన్ యూనియన్ లీడర్ రుందు సింగ్ మాట్లాడుతూ... 'చర్చల విరామంలో మాకు టీ ఆఫర్ చేసిన కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్తో ఆగ్రహంగా ఒక విషయాన్ని చెప్పాం. మీతో కలిసి టీ తాగితే... మేమేదో పకోడాలు తింటూ మీతో కాలక్షేపం చేస్తున్నామని మీ మీడియా కోడై కూస్తుంది. అందుకే మాకు మీ టీ వద్దు అని చెప్పాం. దానికి బదులు మా నిరసన ప్రదేశానికి వస్తే పకోడాలు,జిలేబీతో పాటు టీ ఇస్తామని చెప్పాం.' అని తెలిపారు.
చర్చలు ప్రారంభమైన సుమారు 90నిమిషాల తర్వాత కూడా ఎటువంటి పురోగతి లేకపోవడంతో కేంద్రమంత్రి విరామం ప్రకటించారు. అప్పటికే రైతులకు ఎన్నో విధాలుగా నచ్చజెప్ప చూసినప్పటికీ వారు వినిపించుకోలేదు. వ్యవసాయ చట్టాలపై కమిటీ ప్రతిపాదనను రైతుల ముందు పెట్టగా.. మరో మాట లేకుండా దాన్ని వారు తిరస్కరించారు. చర్చల్లో పాల్గొన్న 35 రైతు సంఘాలు ఆ ప్రతిపాదనకు నో చెప్పాయి.
ఈ కమిటీలో కేంద్ర ప్రభుత్వ అధికారులు, వ్యవసాయరంగ నిపుణులు ఉంటారని, రైతు సంఘాల నుంచి ఎవరు ప్రతినిధులుగా ఉంటారో పేర్లు ఇవ్వాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర తోమర్ రైతు సంఘాలను కోరారు. అయితే ఎలాంటి కమిటీల ఏర్పాటుకు తాము ఒప్పుకునే ప్రసక్తే లేదని... మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేనని రైతులు తేల్చి చెప్పారు. చర్చలు కొలిక్కి రాకపోవడంతో డిసెంబర్ 3న మరోసారి కేంద్రమంత్రులు రైతులతో సమావేశం కానున్నారు.
Recommended Video
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై తొలి నుంచి రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. ఈ చట్టాలతో రైతులకు ఆర్థికంగా చాలా మేలు జరుగుతుందని కేంద్రం చెప్తుండగా... చిన్న,సన్నకారు రైతులు చితికిపోతారని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కనీస మద్దతు ధరకు గ్యారెంటీ లేకుండా రైతులను పూర్తిగా ప్రైవేట్ వ్యాపారుల దయా దాక్షిణ్యాలకు వదిలేస్తున్నారని విమర్శిస్తున్నాయి. పంజాబ్,హర్యానా,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల రైతులు ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్రంగా మహా పోరాటానికి పూనుకున్నారు.