కమిటీని ఒప్పుకోం.. చర్చల ప్రసక్తే లేదు.. ప్రభుత్వమే ఇలా చేయిస్తోంది.. కుండబద్దలు కొట్టిన రైతులు...
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు స్టే విధించడంతో పాటు సమస్య పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే కమిటీ ఏర్పాటుపై రైతుల నుంచి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే వ్యక్తులతో కమిటీని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామనడం నమ్మశక్యంగా లేదని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఈ కమిటీని ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకునే ప్రసక్తే లేదంటున్నారు.
కమిటీపై రైతుల అనుమానాలు... ప్రభుత్వమే...
'ఈ కమిటీని మేము ఒప్పుకోము. ఇందులో ఉన్న సభ్యులంతా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించేవారే... ఆ చట్టాలను సమర్థించేవారే... కేంద్ర ప్రభుత్వమే సుప్రీం కోర్టు ద్వారా ఈ కమిటీని ముందుకు తెస్తున్నట్లు మేము భావిస్తున్నాం. కేవలం రైతుల ఆందోళనల నుంచి అందరి దృష్టి మరల్చేందుకే ఈ కమిటీని ఏర్పాటు చేశారు.' అని పంజాబ్కి చెందిన పలు రైతు సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. అంతేకాదు,ఒకవేళ ఈ కమిటీలో సభ్యులను మార్చినా సరే ప్రభుత్వంతో చర్చలకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు.
రద్దు చేయాలన్నదే మా డిమాండ్ : రైతు సంఘాలు
'వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు స్టే విధించడం మంచి పరిణామం. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. అయితే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్నదే మా డిమాండ్. అది కాకుండా ఏ చర్యలు తీసుకున్నా అవన్నీ తక్కువే అవుతాయి.' అని రైతు సంఘాలు వెల్లడించాయి. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న శాంతియుత వాతావరణంలో రైతు సంఘాల ట్రాక్టర్ల ర్యాలీ జరిగి తీరుతుందన్నారు. కొంతమంది తాము పార్లమెంట్ భవనంపై వైపు లేదా ఎర్రకోట వైపు ర్యాలీగా వెళ్తామని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జనవరి 15 తర్వాతే ర్యాలీ ఎలా జరగాలన్న దానిపై నిర్ణయం ఉంటుందన్నారు.
ప్రధాని క్షమాపణలు చెప్పాలి : కిసాన్ మజ్దూర్ సంఘర్ష్
కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ అధ్యక్షుడు సత్నం సింగ్ పన్ను మాట్లాడుతూ... రైతు ఉద్యమం పట్ల ఎలా వ్యవహరించాలో తెలియని ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు,దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 71 మంది రైతు సంఘాల నాయకులపై,900 మంది రైతులపై హర్యానా ప్రభుత్వం పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జనవరి 26న తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనకు దిగిన మొదటి రోజు నుంచి ఇప్పటివరకూ శాంతియుత వాతావరణంలో నిరసన తెలియజేస్తున్నారని... భవిష్యత్తులో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే దానికి కేంద్రానిదే బాధ్యత అని పేర్కొన్నారు. అమృత్సర్ నుంచి ఢిల్లీ వరకూ .10వేల మంది రైతులు,రైతు కూలీలతో చేపట్టిన మార్చ్ మంగళవారం ప్రారంభమవుతుందన్నారు.
సమస్య పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం...
కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు స్టే వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో రైతు సంఘాలతో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు ఒక కమిటీని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది. ఇందులో బీకేయూ అధ్యక్షుడు జితేందర్ సింగ్ మాన్, ఇంటర్నేషనల్ పాలసీ హెడ్ డాక్టర్ ప్రమోద్ కుమార్ జోషీ, అగ్రికల్చరల్ ఎకానమిస్ట్ అశోక్ గులాటీ, శివకేరి సంఘటన మహారాష్ట్ర అధ్యక్షుడు అనిల్ ధనవత్లను సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ రైతు సంఘాలతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తుందని సుప్రీం తెలిపింది. ఈ కమిటీకి రైతులు సహకరించాలని కోర్టు విజ్ఞప్తి చేసింది. అయితే రైతులు మాత్రం ఈ కమిటీపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.