కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు .. రైతుల ఉద్యమాన్ని దుర్భాషలాడటం మానుకోవాలని హితవు
దేశ రాజధాని ఢిల్లీలో అన్నదాతల ఆందోళన కొనసాగుతోంది .నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హస్తిన సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళనకు 21వ రోజుకు చేరుకుంది. ఇటీవల అమల్లోకి వచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలు బుధవారం ప్రభుత్వానికి లిఖితపూర్వక సమాధానం పంపాయి. ప్రభుత్వం లిఖిత పూర్వకంగా డిసెంబర్ 9 న చేసిన ప్రతిపాదన తిరస్కరిస్తున్నట్టు చెప్పాయి .
రైతుల నుండి ప్రభుత్వానికి లిఖిత పూర్వక సమాధానం .. ప్రభుత్వ ప్రతిపాదన తిరస్కరణ
వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్కు పంపిన ఇమెయిల్లో, సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు దర్శన్ పాల్, ప్రభుత్వం నుండి నుండి వచ్చిన ప్రతిపాదన లేఖను ఉద్దేశించి, ఇప్పటివరకూ జరిగిన చర్చల్లో మీ ప్రతిపాదన అప్పటి నుండి ఇప్పటి వరకు అదే విధంగా ఉందని, అందుకే తాము తిరస్కరిస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాదు ఇది 2020 డిసెంబర్ 5 న ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడి చెప్పిన ప్రతిపాదన యొక్క వ్రాతప్రతి అని దానికి దీనికి ఏమాత్రం వ్యత్యాసం లేదని పేర్కొన్నారు.
రైతు ఉద్యమాన్ని అవమానించకండి .. రైతు సంఘాల్లో చీలిక యత్నాలు మానుకోండి
రైతుల ఉద్యమాన్ని ప్రభుత్వం దుర్భాషలాడటం మానేయాలని రైతు సంఘం నాయకుడు దర్శన్ పాల్ ప్రభుత్వాన్ని కోరారు. ఇదే సమయంలోఇతర రైతు సంస్థలతో సమాంతర చర్చలను ఆపాలని మేము కోరుకుంటున్నాము, రైతు సంఘాలలో చీలిక తీసుకురావడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు . రైతు సంఘాల నుండి ప్రభుత్వానికి లిఖితపూర్వక స్పందన వచ్చిందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారి ధృవీకరించారు. అయితే, రైతులతో చర్చలకు ప్రభుత్వం ఆహ్వానం పంపుతుందా అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఆయన నిరాకరించారు.
రైతు సంఘాల సమాధానం తర్వాత చర్చించి తీర్మానిస్తామన్న మంత్రి
కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతులకు పంపిన ప్రతిపాదనపై లిఖితపూర్వక ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తున్నామని చెప్పగా నిరసన తెలిపిన వ్యవసాయ సంఘాల నుండి లిఖితపూర్వక స్పందన వచ్చింది. వారు మాట్లాడాలనుకుంటున్న సమస్యలపై వ్యవసాయ సంఘాల అభిప్రాయాల కోసం మేము ఎదురుచూస్తున్నామని , తద్వారా మేము మళ్ళీ చర్చించి ఈ విషయాన్ని తీర్మానిస్తాము అని మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు.
రైతు సంఘాల నాయకులతో తోమర్ అనధికార చర్చలు
రైతులతో ఉన్న ప్రతిష్టంభనను తగ్గించే తదుపరి చర్యల గురించి తోమర్ కొంతమంది వ్యవసాయ నాయకులతో అనధికారిక చర్చలు జరుపుతున్నారని, డిసెంబర్ 9 న పంపిన ప్రభుత్వ ప్రతిపాదనపై వారి నుండి ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులపై వారు తిరిగి తన అభిప్రాయాన్ని తెలియజేసిన తరువాత వారికి చర్చల కోసం ఆహ్వానం పంపడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.
చట్టాల రద్దుకు రైతు సంఘాల డిమాండ్ , రద్దు చేసేది లేదని తేల్చేసిన కేంద్రం
అయితే, వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం రద్దు చేయదని తోమర్ స్పష్టం చేశారు. కానీ రైతులు మాత్రం వ్యవసాయ చట్టాల రద్దుకే డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెబుతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేస్తేనే ఆందోళన విరమిస్తానని రైతులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెబుతున్నారు. మరి ఈ వ్యవహారంలో రైతుల లిఖిత పూర్వక సమాధానం తర్వాత ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి .