21న రైతుల నిరాహార దీక్ష: హర్యానా హైవేపై 25 నుంచి టోల్టాక్స్ నిలిపివేత
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో హైవేలపై నిరసన చేపట్టిన రైతులు.. సోమవారం రోజు పూర్తిగా నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించారు. అంతేగాక, డిసెంబర్ 25-27 వరకు టోల్ సేకరణ కూడా నిలిపివేస్తామని స్పష్టం చేశారు.
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ముఖ్యంగా పంజాబ్, హర్యానాల నుంచి పెద్ద ఎత్తున రైతులు వచ్చి ఢిల్లీ సరిహద్దులో హైవేలపై నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. చట్టాలను రద్దు చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, సోమవారం రోజు నిరసన ప్రదేశాల్లో రైతులంతా ఒక రోజు పూర్తిగా సోమవారం నాడు నిరాహార దీక్ష చేస్తారని స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్ తెలిపారు.
దేశ వ్యాప్తంగా కూడా రైతులు ఇదేవిధంగా నిరసనలు తెలియజేయాలని యాదవ్ కోరారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. హర్యానా ప్రభుత్వం నిరసన చేస్తున్న రైతులను బెదిరింపులకు గురిచేస్తోందని అన్నారు. ఢిల్లీ-హర్యానా సింఘ్ బోర్డర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ మేరకు చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించొద్దని అన్నారు.
మరో రైతు నేత జగజీత్ సింగ్ దలేవాల మాట్లాడుతూ.. సోమవారం నిరాహార దీక్ష అనంతరం డిసెంబర్ 25-27 వరకు హర్యానా హైవేపై టోల్ సేకరణ అడ్డుకుంటామని తెలిపారు. టోల్ బూత్ లను టోల్ టాక్స్ తీసుకోకుండా అడ్డుకుంటామని చెప్పారు. డిసెంబర్ 23న కిసాన్ దివాస్ సందర్భంగా నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఒక రోజుపాటు ఎవరూ కూడా వంట చేయవద్దని పిలుపునిచ్చారు. కాగా, నిరసనలో పాల్గొంటూ మృతి చెందిన రైతులకు నివాళిగా కొవ్వొత్తులు వెలిగించారు.